Corona Cases India: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినా కొత్త వేరియంట్, పోర్త్ వేవ్ హెచ్చరికలు మొదలయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దేశంలోని ప్రముఖ సంస్థలు జూన్‌లో నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కొత్త వేరియంట్లు ఆందోళన పెంచుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,075 మంది (India reports 2075 COVID19 cases) కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 71 మంది కొవిడ్ 19తో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. 


నిన్నటితో పోల్చితే తగ్గిన పాజిటివ్ కేసులు.. 
కరోనా కేసులు కిందటి రోజుతో పోల్చితే 20 శాతం వరకు తక్కువగా నమోదయ్యాయి. కొవిడ్ మరణాలు సైతం నిన్నటితో పోల్చితే సగానికి తగ్గాయి. దేశంలో మొత్తం కరోనా మరణాలు 5,16,352కు చేరుకున్నాయి. శుక్రవారం నాడు 3,383 మంది కోలుకోవడంతో, భారత్‌లో కరోనా రికవరీల సంఖ్య 4,24,61,926 (4 కోట్ల 24 లక్షల 61 వేల 9 వందల 26)కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్​ కేసులు 27,802కు దిగిరావడం ప్లస్ పాయింట్. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి.







పాజిటివ్ కంటే రికవరీలే అధికం..
శుక్రవారం ఒక్కరోజులో పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధికంగా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు 2 వేల మంది కరోనా బారిన పడగా, అదే సమయంలో 3,383 మంది మహమ్మారిని జయించారు. ఇప్పటివరకూ 78.22 కోట్ల టెస్టులు నిర్వహించగా, నిన్న ఒక్కరోజు 3 లక్షల 70 వేల 514 శాంపిల్స్‌కు నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యాక్సినేషన్ విషయానికొస్తే ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. నేటి ఉదయం వరకు దేశంలో 1,81,04,96,924 (181 కోట్ల 4 లక్షల 96 వేల 924) డోసుల కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా డోసుల నిల్వలు ఉన్నాయి.