Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. 2011లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చోటుచేసుకున్న ఘటనపై సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభకు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు తమ మిత్రపక్షాలనే ఢీకొన్న విషయాన్ని గుర్తుచేశారు. 


వి నారాయణ స్వామి ప్రమోషన్ కోటాపై బిల్లు పెడుతున్న సమయంలో సమాజ్ వాదీ ఎంపీ యశ్వీర్ సింగ్, అతని చేతి నుంచి బిల్లును లాక్కొని చించేశాడు. ఇదే సమయంలో సోనియా గాంధీ యశ్వీర్ సింగ్ కాలర్ పట్టుకునేందుకు ప్రయత్నించారని దూబే గుర్తు చేశారు. మీరు నియంత కాదు, రాణి కాదు, మీరు హింసను ఆశ్రయించలేరు అని అప్పుడు సోనియా గాంధీకి చెప్పినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. ఆ సమయంలో బీజేపీ అక్కడ లేకపోతే సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ఉండేవారు కాదని, కాంగ్రెస్ ఆ ఎంపీలు అందరినీ చంపేందుకు ప్రయత్నించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. 


ఈ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. 33 శాతం కోటాలో ఇతర వెనుక బడిన వర్గాల మహిళలను కూడా చేర్చాలని అన్నారు. ప్రతిపక్షం నుంచి తొలుతగా సోనియా మాట్లాడారు. ఈ బిల్లు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే కన్సర్నడ్‌ గా కూడా ఉన్నామని అన్నారు. భారత మహిళలు రాజకీయ అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఎదురుచూడమని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? అని ప్రశ్నించారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.


ఈ బిల్లుకు తనకు ఎంతో ఎమోషనల్‌ అని, తన భర్త రాజీవ్‌ గాంధీ లోకల్‌ బాడీస్‌లో రిజర్వేషన్లు ప్రారంభించారని సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ నారీ శక్తి వందన్‌ అభియాన్‌ 2023 బిల్లుకు మద్దతిస్తుందని స్పష్టంచేశారు.  అయితే  ఎస్పీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌ కోటా ద్వారా దీనిని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. దీని అమలులో ఆలస్యం చేయడం భారత మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. 


లోక్‌​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. దశాబ్దాలుగా పెండింగ్‌ ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్లైంది. అయితే ఇందులో OBC మహిళలకు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం, చర్చకు దారితీస్తోంది. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ల అంశం గతంలో పార్లమెంట్‌ లోపల, వెలుపల అనేక ఆవేశ పూరిత చర్చలకు కారణమైంది. 1996 మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక OBCలకు రిజర్వేషన్‌ను కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. రాజ్యసభ, శాసనమండలిలకు కూడా రిజర్వేషన్లు పొడిగించాలని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు ఏవీ 2010 బిల్లు, తాజా బిల్లులో పొందుపరచబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో OBC లకు రిజర్వేషన్ కల్పించలేదు.