ABP Southern Rising Summit 2025 | దక్షిణ భారతదేశంలో ABP నెట్వర్క్ జర్నీని, విజయాలను ABP నెట్వర్క్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ ప్రశంసించారు. ఏబీపీ నాడు, ఏబీపీ దేశం వంటి డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారమ్లతో అటు తమిళ ప్రజలు, ఇటు తెలుగు వారికి ఏబీపీ నెట్వర్క్ మరింత దగ్గరైందన్నారు. ABP మీడియా 1922లో ప్రారంభం కాగా, దక్షిణ భారతదేశంలో దాదాపు 5 సంవత్సరాల కిందట తమ జర్నీ ప్రారంభమైందని పేర్కొన్నారు. చెన్నైలోని ఐటీసీ చోళా గ్రాండ్లో మంగళవారం జరుగుతున్న ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఏబీపీ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ మాట్లాడుతూ.. "మేం (ఏబీపీ) 1922లో మా ప్రయాణం ప్రారంభించాము. దక్షిణ భారతదేశంలో దాదాపు 5 సంవత్సరాల కిందట మా జర్నీ ప్రారంభమైంది. ఏబీపీ నాడు, ABP దేశం అనే తమిళం , తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్ఫారాలు ప్రారంభించాం. ఈ 5 సంవత్సరాలలో దక్షిణాది ప్రజల నుంచి మాకు లభించిన ప్రేమ, ప్రశంసలు ఎంతో ప్రోత్సాహాన్ని అందించాయి." దక్షిణ భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, భాష, గొప్ప సామాజిక స్పృహ ABP నెట్వర్క్ జర్నలిజానికి కొత్త దిశను ఇస్తున్నాయని ద్రుబ ముఖర్జీ అన్నారు.
సమ్మిట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ఏబీపీ సదరన్ రైజింగ్ సదస్సును తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. DMK ఎల్లప్పుడూ భాష, రాష్ట్ర హక్కులు, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చేసే కుట్రలను తిప్పి కొడతామన్నారు. ద్రవిడియన్ అల్గారిథమ్తో దేశంలో ఇతర రాష్ట్రాలకు మార్గాన్ని చూపించామని, ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి, తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నటి మాళవిక మోహనన్, చరిత్రకారులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పొల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏబీపీ లైవ్, ఏబీపీ దేశం, ఏబీపీ నాడు డిజిటల్ ప్లాట్ఫాంలలో లైవ్ వీక్షించవచ్చు.