ABP Ideas of India Summit 2026: మారుతున్న ప్రపంచం.. భారత్ ముందున్న వ్యూహాత్మక మార్గం: IDEAS of India వేదికగా అతిదేబ్ సర్కార్
ప్రపంచం మార్పుల మథనంలో ఉందని — సంఘర్షణలు, అంతరాలు, రాజకీయ అనిశ్చితులతో సతమతమవుతోందని ABP NETWORK చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ అన్నారు. IDEAS OF INDIA 2026 సదస్సులో సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించారు.

ABP Ideas of India Summit 2026: ప్రపంచగమనం మారుతున్న వేళ.. భారత్ ప్రపంచస్థాయి గుర్తింపు కోసం వెంటపడకుండా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా ముందుకు నడవాలని అతిదేబ్ అన్నారు. ముంబై వేదికగా జరుగుతున్న IDEAS OF INDIA ఐదో ఎడిషన్లో ప్రారంభోపన్యాసం చేసిన ఆయన ప్రపంచ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. ప్రపంచశాంతి తనంతట తానుగా రాదని గుర్తు చేశారు.
అతిదేబ్ సర్కార్ ప్రసంగ పాఠం పూర్తిగా..
లేడీస్ అండ్ జెంటిల్మెన్… ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026కి స్వాగతం.
కిందటేడాది మానవాళి సరి కొత్త సరిహద్దులను నిర్దేశించుకునే అంశంతో సదస్సు జరిపాం. కానీ ఆ తర్వాత ప్రపంచం మళ్లీ సంఘర్షణలలో చిక్కుకుపోయింది.
ఉపఖండాన్ని యుద్ధం తాకింది. వైట్ హౌస్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేశాయి; వాటిని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత్, యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అదే సమయంలో, ఆ ఒప్పందాన్ని భారత రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గాజా ఇప్పటికీ మంటల్లోనే ఉంది. వెనిజువెలాలో పాలన మార్పు జరిగింది. ఇరాన్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పలు ప్రయత్నాలు జరిగినా శాంతి స్థాపన ఇంకా జరగలేదు.
"ప్రపంచ రాజకీయాల్లో శాంతి ఆటోమేటిక్గా రాదు.."
ప్రపంచ వ్యవస్థపై పునరాలోచన
2014లో Henry Kissinger ప్రపంచానికి ఒక అంగీకృత వ్యవస్థ అవసరమని వాదించారు. "దేశాలు పాటించాల్సిన నియమాలు ఉండాలి; అవి చట్టబద్ధతతో నిలబడాలి"; శక్తి సమతౌల్యంతో అమలు కావాలి. లేదంటే ప్రపంచం అస్తవ్యస్తత వైపు జారిపోతుందని ఆయన హెచ్చరించారు.
1648లో జరిగిన వెస్ట్ఫేలియా ఒప్పందంతో అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడింది. Westphalia శాంతి ఒప్పందం ఏంటంటే దేశాలకు సార్వభౌమత్వం కల్పించడం ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం పవర్ బాలెన్స్ వంటి సూత్రాలపై ఆధారపడింది. అంతర్జాతీయ వ్యవహారాలన్నీ ఈ వ్యవస్థనే అనేక శతాబ్దాల పాటు అనుసరించాయి.
అయితే టెక్నాలజీ అభివృద్ధి, పెరిగిన అంతర్జాతీయ అనుసంధానం, భిన్నమైన వ్యవస్థలను ప్రతిపాదించే దేశాల ఎదుగుదల వెస్ట్ఫేలియన్ వ్యవస్థను సవాలు చేశాయని కిస్సింజర్ అభిప్రాయపడ్డారు. ఏ యూరోప్లో ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిందో అక్కడే దీనికి ముగింపు పలికారు. యూరప్లో ఒక ఖండ స్థాయి కరెన్సీ, సరిహద్దులను నియంత్రించే స్థాయికి చేరుకుంది.
రష్యా యూరప్కు ఒక ఎనిగ్మాలా తయారైంది. యూరోప్ ఎన్నో యుద్ధాలు ప్రారంభించినప్పటికీ, ఆ ఒక్క దేశం మాత్రం ఖండం ఆధిపత్యాన్ని నిరోధించింది. అమెరికాలో ఐడియలిస్టులు ప్రజాస్వామ్య విలువలను వ్యాప్తి చేయాలని చూస్తే, రియలిస్టులు జాతీయ ప్రయోజనాలు, పవర్ బాలెన్స్ కొనసాగాలని భావిస్తున్నారు. ఇక చైనాది మరో ధోరణి.. చుట్టుపక్కల ఉన్న దేశాలు తమను గౌరవంగా పెద్దరికంతో చూడాలని అనుకుటుంటుంది.
కిస్సింజర్ అభిప్రాయం ప్రకారం — సమకాలీన వాస్తవాల ఆధారంగా వెస్ట్ఫేలియన్ వ్యవస్థను ఆధునీకరించి, చట్టబద్ధతతో, శక్తి ఆధారంతో కొత్త స్థిరమైన ప్రపంచ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉంది.
అలాంటి వ్యవస్థ ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే..
Monica Duffy Toft అభిప్రాయం ప్రకారం — రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న పరిస్థితుల్లాంటి ప్రస్తుత జియో పొలిటికల్ వాతావరణంలో ఎవరైతే ఎక్కువ ప్రభావం చూపుతారో వారి జట్లుగా దేశాలు విడిపోతాయి. దేశాలకు సరిహద్దులు మాత్రమే ఉంటాయి. కానీ సార్వభౌమాధికారత్వం ఈ శక్తివంతమైన దేశాల ప్రభావంలో ఉంటుంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు తమ ప్రభావాన్ని ప్రాంతాలపై విస్తరించవచ్చు.
శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, జనాభా, మిలటరీ ఉన్న చైనా ఎదుగుదల శాంతియుతంగా ఉండదని John Mearsheimer అభిప్రాయపడ్డారు. ఆసియాలో చైనా ఎదుగుదలను అమెరికా అంగీకరిచదు. అందువల్ల అనివార్యమైన పోటీ, ఘర్షణ తప్పవు అని ఆయన రాశారు.
Yan Xuetong ప్రపంచం అమెరికా, చైనా అనే రెండు సూపర్ పవర్స్ చుట్టూ తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల్లో చైనా వేగంగా దూరాన్ని తగ్గిస్తోందని ఆయన వాదన.
Michael Beckley వాదన ప్రకారం.. ప్రపంచ వ్యవస్థ స్థబ్దంగా ఉంది. జనాభా, ఉత్పాదకత, భౌగోళిక విస్తరణ పరిమితులను చేరుకున్నాయి. “ప్రపంచ సమతౌల్యాన్ని మార్చేంత వేగంగా ఏ దేశం ఎదగడం లేదు.” ఉత్పాదకత వృద్ధిలో అమెరికా ముందంజలో ఉందని ఆయన అభిప్రాయం.
భారత విధాననిర్మాతల సవాళ్లు
ఈ అనిశ్చిత ప్రపంచంలో భారత విధాననిర్మాతల పని క్లిష్టంగా మారింది. అమెరికా వంటి ప్రధాన మిత్రదేశం లోపలి విషయాలపై దృష్టి సారిస్తోంది. ఉపఖండ పొరుగు దేశాలు అస్థిరంగా ఉన్నాయి. చైనాతో తాత్కాలిక శాంతి కనిపించినా అంతర్గత ఉద్రిక్తతలు ఇంకా ఉన్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందాలు దేశీయ పరిస్థితులకు అనుగునంగా సంస్కరించాలి.
ఇండియా కచ్చితంగా జాతీయ ప్రయోజనాల కోసం పాటు పడాలి. జాతీయ ప్రయోజనం అంటే ఏంటి? ప్రధాని నిర్వచించిన లక్ష్యం — 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడం. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం; కోవిడ్ మహమ్మారి తర్వాత కుటుంబాల పొదుపులు తగ్గడం; అదానీ, రిలయన్స్ తప్ప ఇతర వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడంలో వెనుకంజ వేయడం, నైపుణ్య లోపం కారణంగా యువతకు ఉపాధి అవకాశాల కొరత — ఇవన్నీ సవాళ్లు.
“ఈ పరిస్థితుల్లో అభివృద్ధి అనేది స్థాయి కాదు… అదే జాతీయ ప్రయోజనం,”
రాబోయే రెండు దశాబ్దాల్లో వాస్తవిక పురోగతి సాధించడం భారత లక్ష్యం కావాలి. ఈ మేరకు విధాన నిర్ణేతలు దృష్టి సారించాలి. భారత సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఆర్థిక విధానాలు కొనసాగించాలి
యుద్ధాలు భారత్ అభిమతం కాదు. మన వస్తువులు, సేవలు కొనుగోలు చేసే దేశాలతో వాణిజ్యాన్ని మరింత పెంచాలి. ఉద్యోగాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరచాలి.
అయితే అస్థిర ఉపఖండంలో జాతీయ భద్రతను నిర్లక్ష్యం చేయరాదు. సున్నితమైన రంగాల్లో వ్యూహాత్మక ప్రత్యర్థుల పెట్టుబడులను జాగ్రత్తగా పరిశీలించి అనుమతించాలి. మిగతా రంగాల్లో “మీరు ఎందుకు వచ్చారు?” అనే ప్రశ్నకు బదులుగా “మీ కార్యకలాపాలు కొనసాగించడానికి మేం ఎలా సహాయం చేయగలం?” అని అడగాలి.
యూరోపియన్ యూనియన్తో ఒప్పందం మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగాలను తీసుకురాగలదు. అమెరికాతో ఒప్పందం విషయానికి వస్తే — అక్కడ అనిశ్చిత పరిస్థితి తొలగే వరకు వేచి చూడటం మంచిది
ఇండియా గ్రేట్ పవర్ కావాలా...?
ఇండియా తన పొరుగుదేశాలతో నిస్పక్షపాతంగా, నిశితంగా.. నిశ్శబ్దంగా సంబంధాలు కొనసాగించాలి. గ్రేట్ పవర్గా ఎదగడం అంటే ఏమిటి..? మనం ఎవరినీ బెదిరించాల్సిన పనిలేదు.. అలాగే అన్ని సమస్యలను డీల్ చేయాలి..ఒకప్పుడు చైనా నాయకులు తమ దౌత్యవేత్తలకు ఒక మాట చెప్పేవారు..“ ఏదైనా సాధించాలనుకున్నప్పుడు లో ప్రొఫైల్ మెయెంటైన్ చేయండి.."
ప్రపంచ వ్యవస్థ మారుతున్న ఈ దశలో — సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ.. పురోగతిని సాధించడం భారత లక్ష్యం.
అయితే… “దానికి మనం తప్పనిసరిగా మహాశక్తి కావాలా?”
అని ప్రశ్నిస్తూ అతిదేబ్ సర్కార్ తన ప్రసంగాన్ని ముగించారు.























