ఇంకా పూర్తి స్థాయిలో కొలువుదీరకుండానే 18వ లోక్‌సభ కాకరేపుతోంది. స్పీకర పదవి కోసం అధికార విపక్షాలు పోటీ పడుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఇండీ కూటమి ఏకంగా స్పీకర్ పదవి కోసం పోటీ పడుతోంది. ఎన్డేఏ కూటమి తరఫున బీజేపీ ఎంపీ ఓం బిర్లా నామినేషన్ వేయగా... ఆఖరి నిమిషంలో ఇండీ కూటమి తరఫున కే. సురష్‌ నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ పదవి కోసం పోటీ అనివార్యమైంది. సుదీర్ఘ కాలం తర్వాత లోక్ సభ స్పీకర్ పదవికి ఇవాళ(బుధవారం) ఎన్నిక జరుగనుంది. దీంతో ఆయా పార్టీలు తమ తమ ఎంపీలకు తమ స్టాండుకు అనుకూలంగా ఓటేసేందుకు తప్పక లోక్‌సభకు హాజరు కావాలంటూ విప్ జారీ చేశాయి. 


1976 తరువాత ఇదే


స్వాతంత్య్రానికి ముందు స్పీకర్ పోస్టుకు ఎన్నిక తప్పనిసరిగా జరిగేది. అయితే స్వతంత్రం వచ్చాక  ఇప్పటి వరకూ కేవలం మూడు సార్లే స్పీకర్  పదవికి అభ్యర్థులు పోటీ పడటం జరిగింది. 1952, 1967, 1976 సంవత్సరాల్లో మాత్రమే ఇప్పటి వరకూ లోక్ సభ స్పీకర్ కు పోటీ నెలకొన్న పరిస్థితులున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే ఎన్నిక కావడంతో సర్వత్రా దీనిపై ఆసక్తి నెలకొంది. 1976 తరువాత ఇదే తొలిసారి ఇలాంటి ఎన్నిక జరుగుతోంది. 


టీడీపీ విప్ 


లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. బుధవారం లోక్ సభకు 11 గంటల కల్లా ఎంపీలు తప్పనిసరిగా హాజరు కావాలని,  ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలని లోక్ సభలో టీడీపీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి కోరారు.  అంతకు ముందే  ఉదయం 9.30 గంటలకు లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం జరుగనుంది. దీంట్లో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు.  ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలను కూడా లావు నివాసంలోజరిగే సమావేశానికి టీడీపీ ఆహ్వానించింది.  


బీజేపీ, కాంగ్రెస్ సైతం


లోక్ సభ స్పీకర్ పోస్టుకు ఎన్నిక జరుగున్న వేళ బీజేపీ మంగళవారం తన పార్టీ సభ్యులకు విప్ జారీ చేసింది. బుధవారం జరిగే ఎన్నిక కోసం  ఉదయం 11 గంటల కల్లా తమ పార్టీ ఎంపీలు తప్పక లోక్ సభకు హాజరు కావాలని ఆ విప్‌లో పేర్కొంది.  మరోవైపు కాంగ్రెస్ సైతం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. బుధవారం 12 గంటల వరకు లోక్ సభలో తప్పక హాజరు కావాలని కోరింది. చాలా ముఖ్యమైన ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు అంతా.. తప్పకుండా లోక్ సభకు హాజరవ్వాలని, లోక్ సభ సెషన్ పూర్తయ్యే వరకు సభలోనే ఉండాలని విప్ లో కోరింది. పార్టీ స్టాండ్ కు సపోర్టు చేయాలని సూచించింది. కాంగ్రెస్ చీఫ్ విప్ కే. సురేష్ ఈ మేరకు పార్టీ ఎంపీలను కోరారు. 


డిప్యూటీ ఇవ్వనన్నారని.. 


లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్‌డీఏ తరఫు అభ్యర్థి ఓం బిర్లా తో పాటు ఇండి కూటమి అభ్యర్థి కె. సురేష్ సైతం పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. తొలుత బీజేపీ ఎంపీ ఓం బిర్లాను స్పీకర్ పదవికి అధికార పక్షం ప్రతిపాదించింది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని ఇండి కూటమి తరుఫున రాహుల్ గాంధీ ప్రతిపాదించినా దానికి అధికార ఎన్డీఏ కూటమి అంగీకరించలేదు. దీంతో ఇండి కూటమి తమ స్పీకర్ అభ్యర్థిగా కే. సురేష్ ని ప్రకటించింది. దీంతో ఎన్డీఏ కూటమి తమ తరఫున ఎంపీ ఓం బిర్లా స్పీకర్ పోటీలో ఉంటారని పేర్కొంది. దీంతో బుధవారం  స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.