J&K Issue At UNGA:


యూఎన్‌జీఏలో మాటల యుద్ధం..


యునైటెడ్‌ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)లో భారత్, పాక్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. పదేపదే జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తి ఇండియాపై ఆరోపణలు చేస్తున్న పాక్‌కి భారత్ గట్టిగానే బదులిస్తోంది. పాకిస్థాన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్వాహ్ ఉల్ హక్ కకర్ జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై ఇండియా స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. ముందు మీ దేశం పరిస్థితులు చక్కబెట్టుకోండి అంటూ తేల్చి చెప్పింది. పాక్‌లో మైనార్టీలపై జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలని హితవు పలికింది. ముఖ్యంగా మహిళలు, క్రిస్టియన్‌లపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని మండిపడింది. ఇలాంటి ఆరోపణలు చేయడం పాకిస్థాన్‌కి ఓ అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ విద్వేష ప్రచారం చేస్తోందని విమర్శించింది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ (Petal Gahlot) ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముందు ఆ సంగతి చూడాలని వార్నింగ్ ఇచ్చారు. 


"పాక్‌కి భారత్‌పై విషం కక్కడం అలవాటైపోయింది. విలువైన సమయాన్ని భారత్‌పై విద్వేష ప్రచారాలు చేయడంతోనే వృథా చేసుకుంటోంది. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న విషయం ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలకు బాగా తెలుసు. జమ్ముకశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్‌ అంతర్గత విషయం. ఈ అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం చేసుకోడానికి వీల్లేదు. ఆ దేశంలో మైనార్టీలు, మహిళలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌వైపు వేలు చూపించే ముందు పాక్‌ తన దేశ పరిస్థితులను చక్కబెట్టుకుంటే మంచిది"


- పెటల్ గహ్లోట్, భారత ప్రతినిధి