I Am Moving To Zoho: కేంద్ర  మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఆఫీస్ ప్రొడక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌ను మార్చుకున్నారు. జోహోకు మారుతున్నట్లుగా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన 'స్వదేశీ' పిలుపును అనుసరించి, దేశీయ ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ులగా తెలిపారు.  "డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రెజెంటేషన్లకు మన స్వదేశీ ప్లాట్‌ఫారమ్ జోహోకు మారుతున్నాను.  ప్రధాని  స్వదేశీ పిలుపుకు  స్పందించండి, దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించండి" అని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు.  సెప్టెంబర్ 22, 2025న  ప్రధానమంత్రి మోదీ  'స్వదేశీ'  నినాదం ఇచ్చారు.  "ఈసారి నవరాత్రి చాలా ప్రత్యేకం. GST   ఉత్సవ్‌తో పాటు స్వదేశీ మంత్రానికి కొత్త శక్తి వస్తుంది. వికసిత, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి కట్టుబడి, దేశీయ ఉత్పత్తులు కొనుగోళ్లు చేయండి" అని పిలుపునిచ్చారు. ఈ పోస్ట్‌లో GST 2.0 సంస్కరణలను   కూడా హైలైట్ చేశారు, ఇవి దేశీయ ఉత్పత్తులు కొనుగోళ్లకు సహాయపడతాయని చెప్పారు. మోదీ అరుణాచల్ ప్రదేశ్ వ్యాపారులతో సమావేశంలో కూడా "స్వదేశీ కొనండి, స్వదేశీ అమ్మండి" అని ప్రోత్సహించారు.

ఈ పిలుపుకు స్పందనగా ఎలక్ట్రానిక్స్ & IT మంత్రి అశ్వినీ వైష్ణవ్ అదే రోజు Xలో పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి విదేశీ ప్లాట్‌ఫారమ్‌లకు బదులు జోహోకు మారుతున్నానని ప్రకటించారు.  వైష్ణవ్ పోస్ట్‌లో భారత జెండాను చేర్చి, "ఇది మన స్వదేశీ ప్లాట్‌ఫారమ్" అని హైలైట్ చేశారు. జోహో (Zoho Corporation)ను 1996లో శ్రీధర్ వెంబు, టోనీ థామస్ చెన్నైలో స్థాపించారు. ఇది భారతీయ మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ.  మైక్రోసాఫ్ట్ ఆఫీస్, గూగుల్ వర్క్‌స్పేస్‌కు ప్రత్యామ్నాయంగా 55కి పైగా క్లౌడ్-బేస్డ్ బిజినెస్ యాప్‌లను అందిస్తుంది. *ఆఫీస్ సూట్ డాక్యుమెంట్లు (Zoho Writer), స్ప్రెడ్‌షీట్లు (Zoho Sheet), ప్రెజెంటేషన్లు (Zoho Show),  Zoho CRM (కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్), Zoho Campaigns (ఈమెయిల్ మార్కెటింగ్), Zoho Social (సోషల్ మీడియా మేనేజ్‌మెంట్) వంటివి అందిస్తుంది.   ఇటీవల Zia LLM (ఎయిఐ మోడల్) లాంచ్ చేసింది, బిజినెస్ నీడ్స్‌కు సురక్షితంగా డిజైన్ చేశారు.  2009లో Zoho Corporationగా మారిన ఈ కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్లకు సేవలు అందిస్తోంది. విదేశీ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడకుండా, భారతీయ టెక్ ఇండస్ట్రీని బలోపేతం చేయడానికి జోహో ముందంజలో ఉంది.

వైష్ణవ్ ప్రకటనకు జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వెంటనే స్పందించారు.  "సర్, ధన్యవాదాలు. ఇది మా ఇంజనీర్లకు భారీ మోరాల్ బూస్ట్. 20 ఏళ్లకు పైగా కష్టపడి మా ప్రొడక్ట్ సూట్‌ను బిల్డ్ చేశారు. మిమ్మల్ని, మన దేశాన్ని గర్వపడేలా చేస్తాం. జై హింద్" అని పోస్ట్ చేశారు. ఈ మద్దతు భారతీయ టెక్ కంపెనీలకు ప్రేరణగా మారింది.