Fuel ban on overage vehicles in Delhi NCR: ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలకు ఇంధన సరఫరా నిషేధాన్ని నవంబర్ 1, 2025 నుంచి పూర్తి ఎన్సిఆర్కు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిషేధం 10 సంవత్సరాలకు పైగా పాత డీజిల్ కార్లు 15 సంవత్సరాలకు పైగా పాత పెట్రోల్ కార్లకు వర్తిస్తుంది. ఢిల్లీ ,గురుగ్రామ్, ఫరీదాబాద్, గాజియాబాద్, గౌతం బుద్ధ నగర్, సోనీపట్ లో ఏకకాలంగా అమలులోకి వస్తుంది. మిగిలిన ఎన్సిఆర్ జిల్లాలకు ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేస్తారు. సీఏక్యూఎం డైరెక్షన్ నంబర్ 89ను సవరించి, ఈ నిషేధాన్ని ప్రవేశపెట్టింది. పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమరాలు ఇన్స్టాల్ చేసి, వాహనాల వయస్సును గుర్తించి, పాత వాహనాలకు ఇంధనం ఇవ్వకుండా చేయాలి. ఒకవేళ వాహనం పాతదిగా గుర్తిస్తే సిస్టమ్ ఫ్యూయల్ స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఉల్లంఘన వివరాలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు పంపిస్తారు. వాహనాలను పట్టుకోవడం లేదా స్క్రాప్ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఈ విధానం సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది.
ఈ నిషేధం మొదట జులై 1, 2025 నుంచి ఢిల్లీలో మాత్రమే అమలు చేయాలని ప్రయత్నించారు. సాంకేతిక సమస్యలు, ప్రజా వ్యతిరేకత కారణంగా జూలై 8న జరిగిన 24వ పూర్తి కమిషన్ సమావేశంలో దీన్ని తాత్కాలికంగా నిలిపి, నవంబర్ 1కు వాయిదా వేశారు. ఈ తీర్పు ఢిల్లీ ప్రభుత్వం లేఖ ఆధారంగా తీసుకున్నది, ఇందులో ఏఎన్పిఆర్ సిస్టమ్లో లోపాలు , ప్రాంతీయ సమన్వయం లేకపోవడాన్ని పేర్కొన్నారు. డిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతం ప్రపంచంలోనే అతి కాలుష్యపూరిత ప్రాంతాల్లో ఒకటిగా మారింది. పాత వాహనాలు వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు (వెహిక్యులర్ ఎమిషన్స్)లో 30-40% దాదాపు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సుప్రీం కోర్టు 2018లో పాత వాహనాలపై నిషేధం విధించాలని ఆదేశించినప్పటికీ, అమలులో ఆలస్యం జరిగింది. ఈ నిషేధం ఆదేశాలకు అనుగుణంగా, వాయు కాలుష్యాన్ని 20% తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ నిషేధం ఢిల్లీ-ఎన్సిఆర్లోని లక్షలాది పాత వాహన యజమానులను ప్రభావితం చేస్తుంది. ఇది ప్రజలకు ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, మిడిల్-క్లాస్ కుటుంబాలు మరింత ఇబ్బంది పడతారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, సీఏక్యూఎం ఈ నిషేధం వాయు నాణ్యతను మెరుగుపరచడంలో కీలకమని, పబ్లిక్ హెల్త్కు మేలు చేస్తుందని స్పష్టం చేస్తోంది.