Mob Attack on Foreign Students: గుజరాత్‌లోని ఓ యూనివర్సిటీలో ఐదుగుర విదేశీ విద్యార్థులపై తోటి స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురూ తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో ఈ దాడి జరిగింది. మార్చి 16న రాత్రి నమాజ్ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే కొంత మంది ఒక్కసారిగా విదేశీ విద్యార్థులపై దాడి చేశారు. బాధితుల్లో ఆఫ్రికా, అఫ్గనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలకు చెందిన వాళ్లున్నారు. క్యాంపస్‌లో మసీదు లేదని రాత్రి పూట నమాజ్ చేసుకునేందుకు అందరూ ఒకచోటకు వచ్చామని విద్యార్థులు చెప్పారు. ఆ సమయంలోనే ఉన్నట్టుండి కొంతమంది వచ్చి హాస్టల్‌పై దాడి చేశారు. గదులను ధ్వంసం చేసినట్టు విద్యార్థులు ఆరోపించారు. సెక్యూరిటీ గార్డ్ వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, కానీ ఒక్కసారిగా దాడి చేయడం వల్ల అది సాధ్యం కాలేదని చెప్పారు. నమాజ్ చేసుకోడానికి అనుమతి ఎవరు ఇచ్చారంటూ దాడి చేశారని చెప్పారు బాధితులు. గదుల్లోకి వచ్చి తమపైన దాడి చేయడమే కాకుండా ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈ ఘటన జరిగిన అరగంట తరవాత పోలీసులు హాస్టల్‌కి వెళ్లారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సోషల్ మీడియాలో కొంత మంది ఈ దాడికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశారు. ల్యాప్‌టాప్‌లతో పాటు కొందరి బైక్‌లనూ పూర్తిగా ధ్వంసం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు. హాస్టల్‌పై రాళ్లు రువ్వారు. విదేశీ విద్యార్థులను బూతులు తిట్టారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.  ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా జోక్యం చేసుకుని ఆ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.