Employees Protest: సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మరీ విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు నల్ల బ్యాడ్డీలతోనే హాజరై నిరసన తెలిపారు. సీపీఎస్ అమలు అయిన సెప్టెంబర్ ఒకటో తేదీ ఉద్యోగుల పాలిట చీకటి దినం అని వ్యాఖ్యానించారు. ఓపీఎస్ ను పునరుద్ధరించాలంటూ సీపీఎస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ సచివాలంయలోనూ జీపీఎస్ ను వ్యతిరేకిస్తూ... సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యోగులు చేపట్టారు. ఓపీఎస్ ను పునరుద్ధరిచాలంటూ సంతకాలు సేకరించిన ఉద్యోగులు వినతి పత్రాన్ని సీఎస్ కార్యాలయానికి అందజేశారు. జీపీఎస్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సచివాలయంలో అన్ని బ్లాకుల నుంచి బయటకు వచ్చి సీపీఎస్ ఉద్యోగులు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది దీనిపై నిరసన చేపట్టినందుకు సర్కారు తమపై ఉక్కుపాదం మోపిందని.. తమ ఆందోళనను అణచివేసిందిని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. 


సీపీఎస్ నుంచి బయటకు రాకుండా ఏపీ సర్కారు జీపీఎస్ అంటోందని, అసలు ఇది ఎలా సాధ్యం అవుతుందని నేతలు ప్రశ్నించారు. మొత్తం 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల డిమాండ్ ను మంత్రివర్గ ఉపసంఘానికి వివరించామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ నేతలు చెప్పారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ సొమ్మును ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదని నేతలు ఆక్షేపించారు. ఠక్కర్ కమిటీ ప్రతిపాదనలు పక్కన పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. ఉద్యోగుల డబ్బుతోనే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆర్డినెన్సు తెచ్చే ముందు శాసన సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ కంటే సర్కారు ప్రతిపాదించిన జీపీఎస్ దారుణంగా ఉందని దాన్ని అమలు చేసి లక్షలాది మంది ఉద్యోగులను ముంచొద్దని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.


పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిచాలని ఉద్యోగుల డిమాండ్


పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన సెప్టెంబర్ ఒకటో తేదీని చీకటి రోజుగా భావిస్తున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట్ల రాజేశ్ తెలిపారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ సర్కారు జీపీఎస్ తీసుకు వచ్చి పాత పింఛన్ కు సమానమైన పెన్షన్ ఇస్తున్నామని చెబుతోందని.. కానీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఎన్నో అసంబద్ధ విధానాలు గమనించామన్నారు. ఉద్యోగులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాల్సిందేనని చెప్పారు. అలాగే పదవీ విరమణ పొందే నాటికి తాము దాచుకున్న డబ్బు ఎంతైతే ఉంటుందో దాని ఆధారంగా పెన్షన్ ఇస్తున్నామని చెబుతున్నారని... ఖాతాలో నిల్వ ఉన్న డబ్బుల ఆధారంగా పెన్షన్ ఇవ్వడం సరికాదని ఏపీ సచివాలయం సీపీఎస్ అసోసిషేయన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. జీపీఎస్ పూర్తి లోపభూయిష్టంగా ఉందని.. విధి విధానాలు బయట పెట్టకుండా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకు రావడం సరికాదని ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మాధవి అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి హడావుడి నిర్ణయాలు సరికాదన్నారు.