తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రభాకర్‌రెడ్డికి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఆయన, ఆయన అనుచరుడికి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ షాక్ ఇచ్చింది. బస్సుల కుంభకోణంలో ఈ నిర్ణయం తీసుకుంది. జటాధర ఇండస్ట్రీస్‌ పేరుతో బీఎస్‌-3 వాహనాలను తక్కువ ధరకు కొని వాటిని బీఎస్‌-4 వాహనలుగా మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణ జరుగుతోంది. ఈ కేసులోనే ఈడీ 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. దివాకర్‌ రోడ్‌లైన్స్, జటాధర ఇండస్ట్రీస్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది. 


అటాచ్ చేసిన ఆస్తులు ఇవే


బీఎస్‌4 వాహనాల స్కాంలో  రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఈడీ విచారిస్తోంది. విచారణలో భాగంగానే రూ. 6.31 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, బ్యాంక్‌ డిపాజిట్లు అటాచ్‌ చేశారు. రూ. 15. 79 కోట్ల విలువైన 68 చరాస్తులను కూడా ఈ జాబితాలో చేర్చారు. తక్కువ ధరకే తుక్కు వాహనాలను కొని మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. 


ఇవి ఆరోపణలు


సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్‌-3 కేటగిరి వెహికల్స్‌ను జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్‌ కొని అక్రమాలకు పాల్పడ్డారనేదే కేసు. 154 వాహనాలను జటాధర ఇండస్ట్రీస్ పేరుతో కొంటే... 104 వాహనాలను గోపాల్‌రెడ్డి అండ్‌కో పేరుతో కొనుగోలు చేశారు. వీటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించి బీఎస్‌-4 వెహికల్స్‌గా ఎన్‌వోసీ పొందారు.


నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో రీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 101, తెలంగాణలో 33, కర్నాటకలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కటీ రిజిస్ట్రేషన్ చేయించి రోడ్లపై నడిపారు. 


వాహనాలకు అనుమతి తీసుకున్న దగ్గరి నుంచి లైసెన్స్‌లు పొందడం, బీమా కోసం అన్ని చోట్ల నకిలీ పత్రాలతో కథ నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఎన్‌వోసీ పొందిన వాహనాలను కొన్ని రోజులు తిప్పిన తర్వాత వేరే రాష్ట్రాలకు చెందిన వారికి అమ్మేసేవాళ్లు. 


ఇలా వెలుగులోకి వచ్చిన నేరం


ఇలా వివాదాస్పందంగా ఉన్న వాహనాలను కొన్న యజమానులు తీవ్రం నష్టపోయేవారని విమర్శలున్నాయి. అలా నష్టపోయిన వారిలో కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది. అప్పుడు జరిగిన విచారణలో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. 


విచారణలో భాగంగా పోలీసులు నేషనల్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ రికార్డులు పరిశీలిస్తే అక్కడ కూడా నకిలీ పత్రాలు దొరికాయి. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్‌  ఫిర్యాదు మేరకు పోలీసులు 2020 జూన్‌లో కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిని చేర్చారు. కేసు విచారణలో భాగంగా ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకి కూడా పంపించారు. వాళ్లిద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు.


ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినందున ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలువురు ఆఫీసులు, ఇళ్లలో సోదాలు చేసింది. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు ఆస్తులను అటాచ్ చేసింది.