Govt imposed cap on airlines ticket prices: ఇండిగో విమానయాన సంక్షోభం మధ్య ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచడంపై కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) తీవ్రంగా స్పందించింది. కోవిడ్ తర్వాత మొదటిసారిగా ఫ్లైట్ ఫేర్ పై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని విమానయాన సంస్థలకు ఈ ఆదేశాలు పాటించాలని ఆదేశించింది. ఇండిగో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరించే డిసెంబర్ 15 వరకు ఈ క్యాప్స్ అమలులో ఉంటాయని, ప్రయాణికులను అవకాశవాద ధరల నుంచి రక్షించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంక్షోభంగా మారిన ఇండిగో కష్టాలు గురువారం రాత్రి గరిష్ఠ స్థాయికి చేరాయి. సాధారణంగా రోజుకు 2,200కి పైగా ఫ్లైట్లు నడిపే ఇండిగో, ఆ రోజు 1,000కి పైగా ఫ్లైట్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ మార్కెట్లో 65% వాటాను కలిగి ఉన్న ఇండిగో సంక్షోభం వల్ల, పీక్ ట్రావెల్ సీజన్లో రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మిగిలిన 35% మార్కెట్ షేర్ ఉన్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, అకాసా, స్పైస్జెట్ వంటి సంస్థలపై డిమాండ్ పెరిగి, టికెట్ ధరలు పెరిగిపోయాయి.
ప్రయాణికులు ఇండిగో టికెట్లను రద్దు చేసి, ఇతర సంస్థల్లో బుక్ చేసుకోవలసి వచ్చింది. రౌండ్ ట్రిప్ టికెట్లకు బుక్ చేసుకున్న ప్రయాణికులు, రిటర్న్ టికెట్ను రద్దు చేసి అధికా ధరలకుఇతర సంస్థలో బుక్ చేసుకోవలసి వచ్చింది. ఇండిగో సంక్షోభం మధ్య కొన్ని విమానయాన సంస్థలు అసాధారణంగా ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయని కేంద్రం గుర్తించింది. ప్రయాణికులను ఇలాంటి ధరల నుంచి రక్షించడానికి రెగ్యులేటరీ పవర్లను ఉపయోగించి, అన్ని ప్రభావిత రూట్లలో న్యాయమైన ధరలు నిర్ధారించామని తెలిపింది.
ధర పరిమితులు (ఎకానమీ క్లాస్, నాన్-స్టాప్ ఫ్లైట్లు | దూరం (కి.మీ.) | గరిష్ఠ ఫేర్ (రూ.) | |----------------|-------------------| | 500 వరకు | 7,500 | | 500–1,000 | 12,000 | | 1,000–1,500 | 15,000 | | 1,500 పైన | 18,000
ఈ ఆదేశాల లక్ష్యం మార్కెట్లో ధర విశ్వశనీయతను నిర్వహించడం, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను దోపిడీ చేయకుండా చూడటం. సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రోగులు వంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటానికని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ రియల్-టైమ్ డేటా ద్వారా ధరలను మానిటర్ చేస్తూ, విమానయాన సంస్థలు, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్లతో సమన్వయం చేస్తుందని, ఏదైనా ఉల్లంఘనలకు తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.