Power Cut At Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కరెంట్ పోయింది. కాసేపటి వరకూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోర్డింగ్, చెకిన్‌ సేవలకు అంతరాయం కలిగింది. ఎయిర్‌పోర్ట్‌లోని T3 terminal వద్ద ఉన్నట్టుండి పవర్ కట్ అయిందని ప్రయాణికులు వెల్లడించారు. ఆ సమయంలో డిజి యాత్రతో పాటు చెకిన్ కౌంటర్ పని చేయలేదని చెప్పారు. ఈ మేరకు కొందరు ప్యాసింజర్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. "ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పవర్ లేదు. కౌంటర్ పని చేయడం లేదు" అని పోస్ట్‌లు చేశారు. ఈ పోస్ట్‌లపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ స్పందించింది. ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ సమస్యపై సంబంధిత అధికారులతో చర్చించామని, వాళ్లు అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపింది. దాదాపు 2-3 నిముషాల పాటు అన్ని సర్వీస్‌లు ఆగిపోవడం కలకలం రేపింది. బ్యాగేజ్ లోడింగ్, బోర్డింగ్ గేట్స్‌తో పాటు ఏసీలు ఎఫెక్ట్ అయ్యాయి. ఏసీ లోడ్‌ ఎక్కువగా ఉండడం వల్ల పవర్‌ బ్యాకప్‌కి సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. Digi Yatra సిస్టమ్‌ రీబూట్‌ అయిందని తెలిపారు.