CRED Founder Kunal Shah Meta: ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ యాజమాన్యంలో అత్యంత కీలకమైన మార్పు చోటుచేసుకుంది. గత 7 ఏళ్లుగా వాట్సాప్ అధినేతగా విజయవంతంగా సేవలందిస్తున్న విల్ క్యాత్కార్ట్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అధికారికంగా ప్రకటించారు. విల్ క్యాత్కార్ట్ స్థానంలో భారతీయ టెక్ దిగ్గజం, ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ తదుపరి గ్లోబల్ హెడ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిలికాన్ వ్యాలీ టెక్ ప్రపంచంలో ఒక భారతీయుడికి ఇంతటి అత్యున్నత బాధ్యతలు దక్కడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది.
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఈ కీలక పరిణామాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, విల్ క్యాత్కార్ట్ అందించిన సేవలను కొనియాడారు. మెటా సంస్థలో అత్యంత ప్రతిభావంతుడైన, సమర్థుడైన లీడర్గా విల్ నిలిచారని జుకర్బర్గ్ పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల కస్టమర్ల మైలురాయిని అధిగమించిందని, యూజర్ల వ్యక్తిగత గోప్యత కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి కీలక ఫీచర్లను ఆయన ఎంతగానో సమర్థించారని గుర్తుచేశారు. విల్ క్యాత్కార్ట్ వాట్సాప్ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, మెటా సంస్థలోనే ఉంటూ సరికొత్త ఉత్పత్తులను మొదటి నుండి అభివృద్ధి చేసే సరికొత్త బాధ్యతల్లోకి మారుతున్నారని జుకర్బర్గ్ స్పష్టం చేశారు.
వాట్సాప్ తదుపరి సారథిగా రాబోతున్న కునాల్ షా నియామకంపై మార్క్ జుకర్బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో అత్యంత విజయవంతమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన CRED ను కునాల్ షా అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ను నడపడానికి అవసరమైన గ్లోబల్ పర్స్పెక్టివ్ , సరికొత్త ఆవిష్కరణలు చేసే బిల్డర్ మెంటాలిటీ కునాల్ షాకు ఉన్నాయని జుకర్బర్గ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సామాన్య ప్రజలకు, మిలియన్ల కొద్దీ వ్యాపార సంస్థలకు ఈ యాప్ను మరింత బెస్ట్ సర్వీస్గా మార్చడానికి కునాల్తో కలిసి పనిచేయడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ స్టార్టప్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తగా కునాల్ షాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతకుముందు ఆయన స్థాపించిన ఫ్రీచార్జ్ ఘనవిజయం సాధించగా, ఆ తర్వాత ప్రీమియం క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన CRED యాప్ దేశంలోనే టాప్ యూనికార్న్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా భారత్లోనే అత్యధిక యూజర్లు దాదాపు 50 కోట్ల మందికి పైగా ఉన్న వాట్సాప్ సంస్థకు.. ఒక భారతీయ టెక్ నిపుణుడు గ్లోబల్ లీడర్ కావడం భారతదేశానికి సైతం గర్వకారణంగా నిలిచింది. సుందర్ పిచాయ్ గూగుల్ , సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ తరహాలోనే ఇప్పుడు కునాల్ షా కూడా గ్లోబల్ టెక్ లీడర్ల జాబితాలో చేరారు.
కునాల్ షా సారథ్యంలో వాట్సాప్ భవిష్యత్తులో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ పేమెంట్స్ విస్తరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం, వాట్సాప్ బిజినెస్ ద్వారా ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయడంపై కునాల్ షా తన మార్క్ చూపే అవకాశం ఉంది. క్రెడ్ అధినేత చేతికి వాట్సాప్ గ్లోబల్ స్టీరింగ్ రావడం మెటా సంస్థ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినట్లయింది.
