Corona Cases: గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం కంటే ఈరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 శాతం తగ్గింది. దీంతో గడిచిన 24 గంటల్లో భారతదేశంలో మొత్తం 6660 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గడిచి 24 గంటల్లో 24 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5 లక్షల 31 వేల 369కి పెరిగింది. అలాగే ప్రస్తుతం భారత్ లో రోజువారీ సానుకూలత రేటు 3.52 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ  శాఖ డేటా వెల్లడించింది. 


కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా


మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల బృందం రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోగ్యాన్ని పరిశీలించారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఢిల్లీలో Indian Air Force Commanders కాన్ఫరెన్స్‌కు రాజ్‌నాథ్ సింగ్ హాజరవ్వాల్సి ఉంది. కానీ కరోనా సోకడం వల్ల ఆయన వెళ్లడం లేదు. గతేడాది జనవరిలోనూ ఆయనకు కరోనా సోకింది. ఒమిక్రాన్ వేరియంట్ బాగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలున్నాయని అప్పట్లో ట్వీట్ చేశారు రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతానికి XBB.1.16 వేరియంట్‌ వ్యాప్తి చెందుతోందని వైద్యులు వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు సోకిన వేరియంట్‌ కూడా ఇదేనా కాదా అన్నది ధ్రువీకరించాల్సి ఉంది. 


తాజాగా పెరుగుతున్న కేసులకు కారణం ఒమిక్రాన్ XBB.1.16  వేరియంట్. దీన్నే ఆర్కుట్‌రస్ అని పిలుస్తారు. మహమ్మారి కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న దేశానికి ఈ కొత్త వేరియంట్ వల్ల మళ్లీ భయాంధోళనలు మొదలయ్యాయి. ఇది తీవ్రంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాబట్టి మళ్లీ  జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆర్కుట్‌రస్ వేరియంట్ వ్యాప్తి వేగం అధికంగానే ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ఇది యువత, పిల్లలను కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. మనుషుల్లోని రోగనిరోధక శక్తిని తట్టకునే లక్షణాలను కూడా ఇది చూపిస్తోంది. 
 
లక్షణాలు ఇలా...


మ్యుటేషన్ చెందుతున్న కరోనా వైరస్ అన్ని వేరియంట్లు ఒకేలాంటి లక్షణాలను చూపిస్తున్నాయి. 


1. జ్వరం ఎక్కువ కాలం పాటూ వేధించడం
2. ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ వేయడం
3. గొంతు మంట
4. కండ్ల కలక
5. తలనొప్పి
6. తీవ్ర అలసట
7. కండరాలు నొప్పి


పైన చెప్పిన లక్షణాలన్నీ దాదాపు ముందు వేరియంట్లతో కలిగేవే. అయితే కొత్తగా ఇందులో చేరినది పింక్ ఐ (కండ్ల కలక). పింక్ ఐ, కోవిడ్-19తో ఎలా సంబంధం కలిగి ఉంటుందనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు. దీనికి ఎక్కువ పరిశోధన అవసరం. ఇది 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో బయటపడుతున్న లక్షణం. 


జాగ్రత్తలు ఇలా...


1. మునుపటిలాగే బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి. 
2. రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు. 
3. హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా వాడాలి.
4. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
5. బూస్టర్ షాట్ తీసుకోవాలి. 
6. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను రోజూ తీసుకోవాలి.