Chennai IT company gifts cars to employees: చాలా కంపెనీలు వందల కోట్ల లాభాలు పొందుతున్నా ఉద్యోగులకు సరిగ్గా జీతాలు పెంచేందుకు కూడా ఆసక్తి చూపించవు. కానీ కొన్ని కంపెనీలు దీనికి మినహాయింపు. దీపావళి సందర్భంగా తమ కంపెనీల్లో ఉద్యోగులకు కార్లు.. ఇతర బహుమతులు ఇస్తున్నారని కొన్ని కంపెనీల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆ కంపెనీలు వజ్రాల ప్రాసెసింగ్ లో ఉంటాయి. కానీ  ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు ఇలాంటి బహుమతులు ఇస్తున్నాయి.               

చెన్నైలో ప్రధాన కార్యాలయం ఉన్న టెక్ సర్వీసెస్ సంస్థ అజిలిసియం  పదేళ్లు పూర్తి చేసుకుంది. తన 10 ఏళ్ల ప్రస్థానంలో తమతో కలిసి ప్రయాణించిన   ఉద్యోగులకు 25 కొత్త హ్యుందాయ్ క్రెటా SUVలను బహుమతిగా ఇచ్చింది. ఈ ఉద్యోగులు సంస్థను స్థాపించినప్పటి నుంచి   అజిలిసియం ప్రయాణంలో భాగమై, వరుసగా పది సంవత్సరాలు పని చేస్తూనే ఉన్నారు.  

 చెన్నైలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న కంపెనీ కార్యాలయంలో  ఈ బహుమతి ప్రదానోత్సవం జరిగింది.  ఈ సందర్భంగా 500 మందికి పైగా టీమ్ సభ్యులు పండుగలాగా వేడుకలు జరుపుకున్నారు. పదో వార్షికోత్సవాన్ని భారీగా ప్లాన్ చేసుకున్నారు కానీ..  పదేళ్ల నుంచి కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇస్తారని ఎవరూ అనుకోలేదు. ఎలాంటి ప్రకటనలు చేయలేదు కూడా. కానీ వేడుకల్లో ఒక్కసారిగా ఈ ప్రకటన చేసేసరికి ఉద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తింది. ఈ వేడుకలకు ఉద్యోగుల కుటుంబసభ్యులను కూడా పిలిచారు.               ఊహించని  కారు బహుమతులతో పాటు, అజిలిసియం సంస్థలోని ప్రతి స్థాయిలో వ్యక్తిగత పనితీరు ఆధారంగా వేతన పెంపును కూడా ప్రకటించింది.అజిలిసియం వ్యవస్థాపకుడు , CEO అయిన రాజ్ బాబు తన కంపెనీ  ప్రధాన బలం ఉద్యోగులేనని  అందుకే వారికి సముచితమైన గౌరవం ఇస్తామని అంటున్నారు. ఈ బహుమతులు ఉద్యోగుల సహకారాన్ని గుర్తించడమే కాకుండా, సంస్థ   ఉమ్మడి విలువలు, ఉద్యోగులు మరింత సృజనాత్మకంగా పని చేసే సామర్థ్యాన్ని పెంచుతాయని నమ్ముతున్నారు.                                        

చెన్నై కంపెనీ ఉద్యోగుల పట్ల చూపించిన ఉదారత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ప్రయత్నం ఆలోచనాత్మక కార్పొరేట్ కృతజ్ఞతకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని పలువురు ప్రశంసించారు.