Chandrayan 3: చంద్రయాన్ - 3 మిషన్ ఘన విజయం సాధించడంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. బుధవారం రోజు సాయంత్రం 6.04 గంటలకు చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్ లో పంపించిన రోవర్ పేరు ప్రజ్ఞాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై తన అధ్యయనం మొదలు పెట్టింది. ఇప్పటికే ల్యాండర్ క్షేమంగా దిగడంతో భారత దేశ ప్రజలంతా ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఇస్రో అధికారులు తమ అధికారిక ట్విట్టర్ నుంచి ఓ ట్వీట్ చేసింది. చంద్రయాన్ - 3 రోవర్ చంద్రుడి కోసం భారతదేశంలో తయారు అయిందని చెప్పింది. అలాగే ల్యాండర్ నుంచి రోవర్ సజావుగా బయటకు వచ్చిందని వెల్లడించింది. మిషన్ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్లను త్వరలోనే షేర్ చేస్తామని పేర్కొంది. 






మైక్రోవేవ్ సైజులో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్లు అంటే 1640 అడుగుల వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు. రోవర్ లో కెమరా, స్పక్ట్రో మీటర్, మాగ్నెటో మీటర్ తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రుడిపై వాతావరణం, భూగర్భం శాస్త్రం, ఖనిజ శాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తోంది. 


చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన వెంటనే ల్యాండర్ విక్రమ్ కూడా వెంటనే పని మొదలు పెట్టేసింది. ఇప్పటికే అక్కడి నుంచి నాలుగు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. బెంగళూరు కేంద్రానికి, చంద్రయాన్ 3 ల్యాండర్ కు కనెక్షన్ కుదిరింది. హారిజాంటర్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలు ఇవి అని ఇస్రో పేర్కొంది. ల్యాండింగ్ ఇమేజర్ కెమెరా నుంచి చంద్రుడిపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అయిన తరువాత తీసిన ఫొటోను ఇస్రో షేర్ చేసింది. ఇది చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్‌లో ల్యాండర్ తీసిన ఫొటో. ఈ ఫొటో గమనిస్తే మీకు ల్యాండర్ ఒక కాలు నీడ కనిపిస్తుంది అని ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రుని ఉపరితలంపై చదునైన ప్రాంతాన్ని చంద్రయాన్-3 ఎంచుకుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసల వెల్లువ..


చంద్రయాన్ 3 ప్రయోగంతో ఇస్రో చరిత్ర తిరగరాసింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవడపై  ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. సినీ, రాజకీయ, వ్యాపార ఇతర రంగాల ప్రముఖులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత్ సాధించిన విజయంపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది. 


చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ దేశ చరిత్రలో కీలకమైన మైలురాయిగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి క్షణాల్ని చూసినందుకు, ఆస్వాదిస్తున్నందుకు తన జీవితం ధన్యమైందన్నారు. ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని  జొహెన్నెస్‌బర్గ్‌ లో ఉన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ఆయన అక్కడి నుంచే వర్చువల్‌గా చంద్రయాన్‌ - 3 ల్యాండింగ్‌ ప్రక్రియను వీక్షించారు. ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ విజయవంతగా జాబిల్లి ఉపరితలంపై దిగగానే సంబరాలు మొదలయ్యాయి. వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలను అంతర్జాతీయ వేదికగా ప్రధాని మోదీ అభినందించారు. భవిష్యత్తులో భారత్ మరిన్ని విజయాలు సాధిస్తుందని, ఈ ఘనతకు సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.