PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన (Surya Ghar Muft Bijli Yojana) పథకానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అర్హులైన కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకూ సౌర విద్యుత్ ఉచితంగా లభించనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా వెల్లడించారు. ఇందుకోసం కేంద్రం రూ.75,021 కోట్లు ఖర్చు చేయనుంది. ఇళ్ల పైకప్పులపై సోలార్‌ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. 






"ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ అందుతుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్‌ సోలార్ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేస్తాం"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి


ఖరీఫ్ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని ఫర్టిలైజర్స్‌పైనా సబ్సిడీ అందించనుంది కేంద్రం. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదం లభించింది. Nutrient Based Subsidy స్కీమ్ కింద మూడు రకాల ఫర్టిలైజర్స్‌ రైతులకు సబ్సిడీ ధరలో లభించనున్నట్టు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మొత్తం రూ.24,420 కోట్ల సబ్సిడీ అందించనుంది.ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఈ స్కీమ్‌ వర్తిస్తుందని తెలిపారు.  






సెమీకండక్టర్‌ల కొరత తీర్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా సెమీకండక్టర్ హబ్‌ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. టాటా, పవర్‌ చిప్ తైవాన్ సంయుక్తంగా గుజరాత్‌లోని ధొలెరా ప్రాంతంలో ఈ ప్లాంట్‌ని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.