బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న ప్రగతి భవన్ లో జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో...పార్లమెంట్ ప్రత్యేక సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 


పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు జరగనున్నాయ్. వర్షాకాల సమావేశాలు ముగిశాక నవంబరు మూడోవారం తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగియగా 40 రోజుల్లోపే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో వేర్వేరు వర్గాలు భిన్న అంచనాలు వేస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించడానికి పార్లమెంటును సమావేశపరుస్తున్నారని కొందరు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉమ్మడి పౌరస్మృతి (ucc) అమలు, ఓబీసీ వర్గీకరణకు జస్టిస్‌ రోహిణి కమిషన్‌ చేసిన సిఫార్సుల ఆమోదం వంటివి చర్చించడానికేనని మరికొందరు చెబుతున్నారు. సమావేశాలను కొత్త పార్లమెంటు భవనంలో నిర్వహించే అవకాశం ఉంది. 


పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతురన్న చర్చ జరుగుతోంది. పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలో కనీసం అయిదు అధికరణలను సవరించాలి. రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవాలి. అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లు సేకరించాలి. వీటన్నంటిపై నిర్ణయం తీసుకోవడానికే పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో అరుణాచల్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, హరియాణాల్లోనూ అసెంబ్లీల గడువు ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటితో సంప్రతింపులు చేపట్టి, లోక్‌సభతోపాటే ఈ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలనూ నిర్వహించే అవకాశముంది. 


జీఎస్టీని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వ హయాంలో 2017 జూన్‌ 30న పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ప్రత్యేకంగా అర్ధరాత్రి సమయంలో నిర్వహించారు. ఈసారి మాత్రం అలా కాకుండా పూర్తిస్థాయి సమావేశాల తరహాలో ఐదురోజులపాటు సభలు జరగనున్నాయి. ప్రధాని మోదీ 73వ పుట్టినరోజు మర్నాడే ఇవి మొదలవుతున్నాయి. గతంలో స్వాతంత్య్ర రజతోత్సవాలు/ స్వర్ణోత్సవాలు, క్విట్‌ఇండియా 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.


మోదీ చాలీసా వినడానికి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడం లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.  అదానీ గ్రూప్‌, ఆర్థిక వ్యవహారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు, మణిపుర్‌ అల్లర్లు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకటించారు.