BJP top leaders campaign in Kerala Assembly elections:   కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అధిష్టానం, క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.  తాజాగా  ఢిల్లీ ముఖ్యమంత్రి  రేఖా గుప్తా ఎర్నాకులం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ జిల్లాకు ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.  

Continues below advertisement

కేరళ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, సంప్రదాయ కూటములకు స్వస్తి పలికి ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్  సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. మంగళవారం ఎర్నాకులంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం  ఊపందుకున్న తరుణంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి  రేఖా గుప్తా  కేరళ పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన వెల్లడించారు.  

దశాబ్దాలుగా కేరళను పాలిస్తున్న యూడీఎఫ్ (UDF), ఎల్డీఎఫ్ (LDF) కూటముల వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని  బీజేపీ నమ్మకంతో ఉంది.   అభివృద్ధిని విస్మరించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే ఆ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి వర్గాలు ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధి నమూనా పట్ల ఆకర్షితులవుతున్నారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.  

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన పర్యటనలో భాగంగా రాష్ట్ర నాయకత్వంతో భేటీ అయ్యి, ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఉదాహరణగా చూపుతూ, కేరళలోనూ అటువంటి మార్పు సాధ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రేఖా గుప్తా రాకతో పార్టీ కేడర్‌లో నూతనోత్తేజం వచ్చిందని, ఆమె రాజకీయ వ్యూహాలు కేరళలో కమల వికాసానికి దోహదపడతాయని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కేరళలో ఈసారి త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.