BJP is making another foray in the Bengal Assembly elections:  పశ్చిమ బెంగాల్ రాజకీయ రణరంగం మరోసారి హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు దూసుకొస్తున్న భారతీయ జనతా పార్టీ మధ్య చావో రేవో తేల్చుకునే పోరు మొదలైంది. 

Continues below advertisement

కమలం దూకుడు.. కకావికలమైన లెఫ్ట్, కాంగ్రెస్!

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా ముక్కోణపు పోటీ పోయి, ఇప్పుడు నేరుగా టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఈసారి రాష్ట్రమంతటా భారీగా కేడర్‌ను మోహరించింది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్ మరియు గిరిజన ప్రాంతాల్లో బీజేపీ పట్టు పెంచుకుంటూ వస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు బెంగాల్‌ను ఒక ప్రతిష్టాత్మక యుద్ధంగా భావించి ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హిందూ ఓట్ల  పోలరైజేషన్  తమకు కలిసొస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది.

Continues below advertisement

అధికార వ్యతిరేకత మమతా బెనర్జీకి సవాల్      

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  బెంగాల్ కుమార్తెను అనే సెంటిమెంట్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్మీర్ భండార్  వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను కట్టిపడేశాయి. అయితే, సందేశ్‌ఖాలీ వంటి ఘటనలు, టీఎంసీ స్థానిక నాయకులపై వస్తున్న అవినీతి ఆరోపణలు మమతా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారాయి. ముస్లిం ఓటు బ్యాంకు చెల్లాచెదురు కాకుండా చూసుకోవడం మమతకు ఇప్పుడు కీలకం. ఈసారి ఎన్నికల్లో దీదీ తన వ్యక్తిగత చరిష్మాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.

మనుగడ కోసం లెఫ్ట్, కాంగ్రెస్ పోరాటం 

ఒకప్పుడు బెంగాల్‌ను దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టులు,  కాంగ్రెస్ పార్టీల పరిస్థితి దయనీయంగా మారింది.  ఈ రెండు పార్టీలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ వైపు మళ్లిపోయింది. యువతను ఆకట్టుకోవడానికి కమ్యూనిస్టులు కొత్త ముఖాలను రంగంలోకి దించుతున్నా, అది ఎన్నికల ఫలితాల్లో సీట్లుగా మారడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మాల్దా, ముర్షిదాబాద్ వంటి కొన్ని పాకెట్లకే పరిమితం కానుంది. 

బీజేపీకి మెరుగుపడిన అవకాశాలు

బీజేపీకి ఈసారి అధికారంలోకి రావడానికి గతంలో కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్థానిక సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవడంలో కాషాయ దళం సక్సెస్ అయితే బెంగాల్ చరిత్ర మారుతుంది. అయితే, మమతా బెనర్జీని తక్కువ అంచనా వేయలేం. ఎన్నికల సమయంలో ఆమె చేసే పోరాట పటిమ, వీధి పోరాటాలు చివరి నిమిషంలో ఫలితాలను తారుమారు చేయగలవు. బెంగాల్ పీఠం ఎవరిదనేది ఈసారి అతి తక్కువ ఓట్ల శాతంతో తేలేలా ఉంది. బీజేపీ  దండయాత్ర  ఫలించి కోటను స్వాధీనం చేసుకుంటుందా.. లేక మమత తన  బెంగాల్ టైగర్  ఇమేజ్‌తో హ్యాట్రిక్ కొడుతుందా అనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది.