Bengaluru Blast Case: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో NIA ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. గత నెల ఈ కేఫ్‌లో పేలుడు సంభవించగా 10 మంది గాయపడ్డారు. అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తోంది NIA. ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ప్రధాన నిందితుడికి సహకరించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యక్తి పేరు షబీర్‌గా వెల్లడించారు పోలీసులు. బళ్లారిలో అరెస్ట్ చేశారు. మార్చి 1 వ తేదీన పేలుడు సంభవించగా...మార్చి 3వ తేదీన NIAకి ఈ కేసు బదిలీ అయింది. అప్పటి నుంచి ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఓ బస్‌ స్టేషన్‌లో బ్యాగ్‌తో తిరిగిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పేలుడు సంభవించిన గంట తరవాత ఓ బస్‌లో ప్రయాణించాడు. ఈ ఘటన తరవాత నిందితుడి తన దుస్తులు మార్చుకుని బస్‌లో రకరకాల ప్రాంతాల్లో ప్రయాణించినట్టు NIA ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడు సంభవించిన వారం రోజులకు మళ్లీ కేఫ్‌ని తెరిచారు. ఈ సారి భద్రతని మరింత కట్టుదిట్టం చేశారు. లోపలికి వచ్చే ముందే కస్టమర్స్‌ని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు.