Iranian ship shelter by India: హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి దాడిలో ఇరాన్ యుద్ధనౌక IRIS దేనా మునిగిపోయిన ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ నౌక భారత్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన మిలన్-2026 నావికాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా శ్రీలంక తీరానికి సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ నౌక సమాచారం అమెరికాకు భారత్ ఇచ్చిందన్న ప్రచారం జరిగింది. కానీ భారత్ ఆ నౌకను కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ నౌక మునిగిపోవడానికి ముందే భారత్ దీనికి ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమైంది.
అమెరికా దాడికి ముందు భారత్ ఆశ్రయం
ఇరాన్ , అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ప్రమాదాన్ని పసిగట్టిన భారత్ IRIS దేనా కు తన ఓడరేవుల్లో రక్షణ కల్పించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి చివరలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడే, తమ నావికాదళ అతిథిగా వచ్చిన ఈ నౌక సురక్షితంగా ఉండేందుకు భారత్ సేఫ్ హార్బర్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ లోపే మార్చి 4వ తేదీన శ్రీలంకలోని గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో అమెరికా సబ్మెరైన్ ప్రయోగించిన టార్పెడో దాడిలో ఈ నౌక మునిగిపోయింది.
మరో నౌకకు కొచ్చిలో చోటు
IRIS దేనా పై దాడి జరిగిన రోజే, ఇరాన్కు చెందిన మరో యుద్ధనౌక IRIS లావన్ కు భారత్ తన కొచ్చి ఓడరేవులో ఆశ్రయం కల్పించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నౌక అత్యవసరంగా డాకింగ్ కావాలని కోరడంతో, మానవతా దృక్పథంతో భారత్ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ నౌకలోని 183 మంది సిబ్బందికి కొచ్చిలోని నావికాదళ కేంద్రాల్లో భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. దీనితో పాటు IRIS బుషెహర్ అనే మరో నౌకకు శ్రీలంక కూడా ఆశ్రయం ఇచ్చింది.
దౌత్యపరమైన చిక్కులు
భారత్ నిర్వహించిన విన్యాసాలకు అతిథిగా వచ్చిన నౌకపై అమెరికా దాడి చేయడం దౌత్యపరంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అధికారికంగా మౌనం వహించినప్పటికీ, విపక్షాలు దీనిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. భారత నావికాదళం ఆహ్వానించిన గెస్ట్ షిప్ను కాపాడుకోలేకపోవడం మన వ్యూహాత్మక వైఫల్యమని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ దాడికి భారత్కు చట్టపరమైన బాధ్యత లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
యుద్ధం విస్తృతికి సంకేతం
పశ్చిమాసియాకు పరిమితమైన ఇరాన్-అమెరికా సంఘర్షణ ఇప్పుడు హిందూ మహాసముద్రానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. భారత భూభాగానికి ఇంత దగ్గరలో ఒక యుద్ధనౌకను అమెరికా ముంచేయడం ద్వారా, ఇరాన్కు ఎక్కడా రక్షణ లేదనే సంకేతాన్ని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పంపినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత హిందూ మహాసముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై మరియు భారత్ తన తటస్థ వైఖరిని ఎలా కాపాడుకుంటుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
