Bangkok Earth Quake Updates: థాయ్ ల్యాండ్, మయన్మార్ లో వచ్చిన భూకంపం దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కూలిపోయిన భవనాల గురించి మాత్రమే కాదు.. .చిరుగుటాకుల్లా వణికిపోయిన హై రైజ్ అపార్టుమెంట్ల దృశ్యాలు ఇక్కడ కూడా వైరల్ అవుతున్నాయి.
బ్యాంకాక్ ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్రాంతం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. ఈ కారణంగా అక్కడ టూరిజంతో తో పాటు వివిధ రంగాలు అభివృద్ధి చెందాయి. హై రైజ్ బిల్డింగులు పెద్ద ఎత్తున బ్యాంకాక్ లో కనిపిస్తూ ఉంటాయి. భూకంపం కారణంగా అవన్నీ కదిలిపోయాయి. ఇప్పుడు ఆ భవనాలు పనికి వస్తాయో.. లేకపోతే కూల్చేయాలా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టమని నిపుణులు అంటున్నారు
సాధారణంగా ఇలాంటి భారీ హై రైజ్ నిర్మాణాలు భూకంపాలు వచ్చినా తట్టుకునే టెక్నాలజీతో నిర్మిస్తారు. అందుకే ఊగిపోయాయి కానీ.. చాలా వరకూ కుప్పకూలలేదు. భవనాల పైన ఉండే స్విమ్మింగ్ ఫూల్స్ నుంచి నీల్లు కిందపడ్డాయంటే ఎంత ఎక్కువగా ఊగాయో అర్థం చేసుకోవచ్చు. అంత ఊగిన తర్వాత బిల్డింగ్ స్ట్రక్చర్ ఖచ్చితంగా దెబ్బతింటుందని అంటున్నారు.
బ్యాంకాక్ భూకంపం దృశ్యాలు చూసిన తర్వాత చాలా మంది అలాంటి భూకంపం మన వద్ద వస్తే పరిస్థితి ఏమిటని భయపడటం సహజం. నిజానికి హైదరాబాద్ వాసులకు ఈ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది.ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నలభై, యాభై అంతస్తుల భవనాలను సులువుగా నిర్మించేస్తున్నారు. ఐదారు అంతస్తుల అపార్టుమెంట్లు ఇప్పుడు పాతవైపోతున్నాయి. కనీసం పాతిక నుంచి అరవై అంతస్తుల వరకూ నిర్మించేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ భూకంపాలను తట్టుకునేలానే హై రైజ్ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నాయి. పైగా హైదరాబాద్ భూకంపాల జోన్ పరిధిలో లేదు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల కారణం.. భూమిపై ఏ ఒక్క ప్రాంతం సురక్షితమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంపాలను తట్టుకునేలా నిర్మించినా సరే.. రికార్డు స్థాయిలో ఏడు శాతం కన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే.. నష్టం జరగకుండా నివారించడం సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది.