Balochistan Liberation Army killed ten Pakistani soldiers : బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ  పాకిస్తాన్ సైన్యంపై  క్వెట్టా సమీపంలోని మార్గట్ ప్రాంతంలో  దాడి చేసింది.   బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)   ఫిదాయీ యూనిట్ రిమోట్-కంట్రోల్డ్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) ఉపయోగించి పాకిస్తానీ సైన్యం  కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. 

BLA తమ దాడిలో 10 మంది పాకిస్తానీ సైనికులను చంపినట్లు  వీడియో రిలీజ్ చేసింది. అయితే  పాకిస్తానీ అధికారులు ఈ సంఖ్యను ధృవీకరించలేదు.BLA మీడియా విభాగం  హక్కల్ ఈ దాడి యొక్క వీడియో ఫుటేజీని విడుదల చేసింది, ఇది దాడి యొక్క తీవ్రతను , వాహనం ధ్వంసమైన దృశ్యాలను చూపిస్తుంది. BLA ప్రతినిధి జీయంద్ బలూచ్ ఈ దాడిని ధృవీకరిస్తూ, ఇది "బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం" జరిగిన ఆపరేషన్‌లో భాగమని పేర్కొన్నాడు.  

 పాకిస్తానీ సైన్యం లేదా పోలీసుల నుండి ఈ ఘటనపై అధికారిక ధృవీకరణ ఇంకా స్పష్టంగా రాలేదు, కానీ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఈ దాడిని ఖండించారు. పాకిస్తానీ మీడియా, అధికారులు ఈ దాడిని "తీవ్రవాద చర్య"గా వర్ణించారు.

 BLA అనేది బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న విమోచన సాయుధ సంస్థ. ఈ సంస్థ పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్‌ను ఆర్థికంగా దోపిడీ చేస్తోందని, స్థానిక బలూచ్ ప్రజలను విస్మరిస్తోందని ఆరోపిస్తుంది. BLA గత రెండు దశాబ్దాలుగా పాకిస్తానీ సైన్యం, ప్రభుత్వ సంస్థలు, ,చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై దాడులు చేస్తోంది.  ఏప్రిల్ 15న మస్తుంగ్‌లో ముగ్గురు సైనికులు మరణించారు, ఏప్రిల్ 17న కెచ్ జిల్లాలో ఒక సైనికుడు మరణించాడు,  ఏప్రిల్ 20న హోషాబ్‌లో లెవీస్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు BLA సైనిక సామర్థ్యం,వ్యూహాత్మక దాడుల సామర్థ్యం పెరిగినదానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. 

ఈ దాడి పాకిస్తానీ సైన్యం బలూచిస్తాన్‌లో చేస్తున్న "ఆక్రమణ"కు ప్రతిస్పందనగా జరిగింది. సైనికులను లక్ష్యంగా చేసుకున్నామని,  స్వాతంత్ర్య పోరాటంలో భాగమని  బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మి ప్రకటించుకుంది.   బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద , సహజ వనరులతో సమృద్ధమైన ప్రాంతం, కానీ ఇది అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ప్రత్యేక  బలూచిస్తాన్ కోసం అక్కడి ప్రజలు పోరాడుతున్నారు.