Ayodhya Pran Pratishtha: 500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఉద్విగ్నంగా నిరీక్షించిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్‌లో ప్రాణ ప్రతిష్ఠ తంతుని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాని మోదీతో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. 


 







పట్టు వస్త్రాలు ధరించి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయోధ్య ధామ్‌లో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అందరినీ భావోద్వేగానికి గురి చేస్తుందని అన్నారు. 






మైసూరుకు చెందిన అరుణ్ యోగి రాజ్‌ ఈ బాల రాముడి విగ్రహాన్ని చెక్కాడు. 51 అంగుళాల ఈ రామయ్య విగ్రహం ఎత్తు 5 అడుగులు. నిజానికి బాల రాముడికి సంబంధించిన మూడు రకాల విగ్రహాలను చెక్కించింది ట్రస్ట్. అందులో దేనికైతే ఎక్కువ ఓట్లు పడతాయో దాన్ని ఎంపిక చేసుకుంటామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే ఓటింగ్ నిర్వహించి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు గర్భ గుడిలో కొలువు తీరింది ఈ విగ్రహమే. పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో ధగధగా మెరిసిపోతున్నాడు బాల రాముడు. నుదుటన వజ్రనామం చూపు తిప్పుకోనివ్వడం లేదు. బాల రాముడికి తొలిహారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరవాత సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల అనుష్ఠాన దీక్షని విరమించారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు దీరేంత వరకూ అత్యంత నిష్ఠగా ఉంటానని జనవరి 12వ తేదీన ప్రకటించారు మోదీ. అప్పటి నుంచి అదే నిష్ఠను కొనసాగిస్తున్నారు. ఇవాళ (జనవరి 22) ప్రాణ ప్రతిష్ఠ ముగిసింది. ఆ తరవాత ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. ఆ సమయంలోనే తీర్థం తీసుకుని తన కఠిన దీక్షని విరమించారు.