Telangana Politics View Point :  ఎన్నికలు దగ్గర పడే వేళ.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. క్లియర్ అవతోంది. ఎవరు ఎవరికి దగ్గరగా జరుగుతున్నారో .. తెలుస్తూ ఉంది. బాహర్ మే కుస్తీ.. అందర్ మే దోస్తీ లా ఉండే తెలంగాణ పాలిటిక్సులో ఎవరు ఎవరి వైపు ఉన్నారో చెప్పడం కష్టం..ఎలక్షన్ కు నాలుగైదు  నెలలు కూడా లేవు కాబట్టి ఇక బయట పడకతప్పదు.  ఆ ఛాయలే భారత రాష్ట్ర సమితిలో బయట పడుతున్నాయని .. రాజకీయ పరిశీలకులు.. చెబుతున్నారు. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ ఎలాగో భాజపా-భారస ఒకటేనని భాజప్తా చెబుతోంది. 


క్లియర్ అవుతున్న  తెలంగాణ రాజకీయ ముఖచిత్రం  


ఏడాది కిందట చూస్తే... కేసీఆర్ సుదీర్ఙమైన ప్రెస్ మీట్ లు పెట్టేవారు. ఒకటే అజెండా. టార్గెట్ మోదీ అన్నట్లుగా ఉండేవి ఆ మీడియా సమావేశాలు. క్రమంగా ప్రెస్ మీట్లు తగ్గాయి. బీజేపీ గురించి మాట్లాడటం తగ్గింది. ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను కలవడం కూడా జరుగుతోంది. ఈ 3-4 నెలల్లో పరిణామాలు ఇవి. ఎవర్నైనా అమాంతం పొగిడేయడం.. అంతే తిట్టేయడం లాయల్టీలను వేగంగా మార్చేయడం.. ఇవన్నీ కేసీఆర్ టైప్ పాలిటిక్స్. ఇదంతా తెలంగాణ కోసమే అని చెప్పగల చతురత... అదే  రాజనీతి అని ఒప్పించగల నైపుణ్యం ఆయన సొంతం. అలాంటి కేసీఆర్ ఈ మధ్య బీజేపీపై దూకుడు తగ్గించినట్లు అర్థమవుతోందంటే.. అందులో ఏదో పరమార్థమో .. నిగూడార్థమో ఉండే ఉంటుంది. 


బీఆర్ఎస్ - బీజేపీ ఒకటేనంటున్న కాంగ్రెస్ 


కేసీఆర్ లో వచ్చిన ఈ మార్పునే  కాంగ్రెస్ పట్టేసింది. భాజపా- భారసా ఒకటేనని చెప్పేస్తోంది.  సెంటర్లో బీజేపీకి బీఆరెఎస్ B టీమ్ గా పనిచేస్తే..  తెలంగాణలో BRS కు లోకల్ బీజేపీ బీ టీమ్ అన్నది కాంగ్రస్ ఆరోపణ. ఈ రెండూ ఒకటేనన్న మాట ఈనాటిది కాదు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒకేసీటు. 100కి పైగా స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. మరి అలాంటి పార్టీ ఆ వెంటనే జరిగిన జనరల్ ఎలక్షన్లో నాలుగు ఎంపీ స్థానాల్లో ఎలా గెలవగలిగింది. 20కి పైగా స్థానాల్లో ప్రభావాన్ని ఎలా చూపెట్టింది. అన్నదానిపై కాంగ్రెస్లో అనుమానాలున్నాయి. కేంద్రంతో దోస్తీ కోసం కేసీఆరే సహకరించారన్నది వాళ్ల ఆరోపణ. 


కవిత అరెస్ట్ ఆగిపోవడంతో ఒక్క సారిగా మారిన రాజకీయ వాతావరణం 


ఇక్కడ రాష్ట్రంలో బీజేపీతో ఫైటింగ్ ఉన్నా.. కేంద్రంతో మాత్రం మంచి సంబంధాలే నెరిపారు. ఎప్పుడైతే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచి, గ్రేటర్ కార్పోరేషన్ లో గట్టి పోటీ ఇచ్చిందో.. సీన్ మారిపోయింది. ఈటెల రాజేందర్ గెలవడంతో పోటీ బీఆరెఎస్- బీజేపీ గా మారిపోయింది. కేసీఆర్ దేశ్ కీ నేతా గా ప్రొజెక్ట్ చేసుకోవడం.. భారసా ఆవిర్భావం... ఇవన్నీ మోదీని ఢీకొట్టడానికే అన్నట్లుగా జరిగాయి.  బీజేపీ ఈడీని దింపితే.. ఈయన సీఐడీని దింపారు. పరస్పర కేసులతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యేవరకూ పరిస్థితి వెళ్లిపోయింది. ఆ తర్వాత  కేసీఆర్ షడన్ గా సైలంట్ అయ్యారు. కవితను కాపాడుకోవడానికే తగ్గుతున్నారా అన్న అనుమానాలు ఉన్నా.. అసలు ఎప్పటి నుంచో వాళ్లు ఒకటేనని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను  దెబ్బతీయడానికి.. ఏ మాత్రం క్యాడర్ లేని బీజేపీని పేపర్ పులిగా మార్చేశారు అన్నది కాంగ్రెస్ వాదన. దానికి తగ్గట్లుగా మొత్తం బీఆరెస్ నేతలంతా కాంగ్రెస్ ను వదిలి బీజేపీనే టార్గెట్ చేసి .. పోటీ ఆ రెండింటి మధ్యనే అన్నట్లుగా మార్చారు. ఈ  రెండు పార్టీల అవగాహనకు అనేక సాక్ష్యాలు కాంగ్రెస్ చూపెడుతోంది. 


• బీజేపీపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కర్ణాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం గట్టిగానే ఉన్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం అటు వైపు చూడలేదు. ఎందుకంటే దానివల్ల బీజేపీకి మైనస్ అవుతుంది అందుకే కేసీఆర్ మాట్లాడలేదు అన్నది కాంగ్రెస్ వాదన.


• రెండో కారణం.. దిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ ప్రస్తావించింది. పలుమార్లు ఈడీ విచారణకు హాజరైంది. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇంకా కొంత మంది పెద్దలు ఈ కేసులో అరెస్టైనప్పటికీ... కవితను మాత్రం ఈడీ అరెస్ట్ చేయలేదు. కారణం..బీజేపీకి బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉంది అందుకే ఈడీ కేసు నుంచి కవిత బయటపడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


• మూడో కారణం.. దిల్లీ స్థాయిలో కేసీఆర్ కు బీజేపీ పెద్దలకు మంచి అవగాహన ఉంది. అందుకే కేసీఆర్ అవినితీ చేశారని ఆరోపిస్తున్నారు తప్ప అధికారంలో వాళ్ల చేతిలో ఉన్నా యాక్షన్ తీసుకోవట్లేదు. కేసీఆర్ తెచ్చిన ధరణిని కాంగ్రెస్ రద్దు చేస్తామంటే.. బీజేపీ మాత్రం రద్దు చేయనంటోంది. దీనికి అర్థమేంటి అని నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 


• 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకుంది. అలాంటింది.. 6నెలల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం 4 ఎంపీ సీట్లు ఎలా సాధించింది అంటున్నారు. కేసీఆర్ ముందస్తుకు బీజేపీ ఒకే చెప్పింది కాబట్టి.. ఎంపీ స్థానాలు కేసీఆర్ కావాలనే అప్పజెప్పారా..? అనే అనుమానాల్ని కాంగ్రెస్ నేతలు లెవనెత్తతున్నారు.


ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనే ఆరోపణలు


కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు... మిగిలిన రాజకీయ పక్షాలు కూడా కేసీఆర్ ను అలాగే చూస్తున్నాయా అన్న అనుమానం ఉంది. జాతీయ పార్టీగా ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. మహరాష్ట్రకు రావడంపై శివసేన తమ అధికారిక పత్రిక సామ్నాలో వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్‌ను MIM పార్టీతో పోల్చింది. బీజేపీయేత పార్టీల ఓట్లను చీల్చడానికి బీజేపీ ఎంఐఎం ను వాడుకునేదని.. ఆ పార్టీ సంగతి అన్ని రాష్ట్రాల్లో తెలిసి పోవడంతో ఇప్పుడు కొత్తగా కేసీఆర్ ను తీసుకొచ్చారని సామ్నాలో రాసుకొచ్చారు. అంతే కాదు. శివసేన నేత  సంజయ్‌రౌత్ కేసీఆర్‌ను బీజేపీ B టీమ్ అని ఆరోపించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా  అదే మాట అన్నారు. 


గతంలో కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నాలు - ఇప్పుడు ఎవరూ పిలవడం లేదు ! 


ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ అందరు నేతలను కలిశారు. కానీ కొన్ని రోజుల కిందట పట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగితే కేసీఆర్‌కు ఆహ్వానం లేదు. పొరుగున ఉన్న కర్ణాటకలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటయ్యి.. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం చేస్తే.. అన్ని చాలా రాజకీయపక్షాలు హాజరయ్యాయి కానీ కేసీఆర్‌ను పిలవలేదు. ఎన్నికలకు ముందు జేడీఎస్ నేత కుమారస్వామి కేసీఆర్‌తో కలిసినా.. కర్ణాటక ఎన్నికల సమయానికి దూరమయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌తో మంచి సంబంధాలే ఉన్నా.. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కట్టడి చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడలేదు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాజకీయ పార్టీలన్నీ స్పందించినా.. కేసీఆర్ మాత్రం  వ్యతిరేకించలేదు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన బహిరంగ సభల్లో బీజేపీ కంటే.. కాంగ్రెస్‌ను ఎక్కువుగా టార్గెట్ చేశారు. కేటీఆర్ వెళ్లి బీజేపీ నేతలను కలుస్తున్నారు. 


 కాంగ్రెస్ తో హోరాహోరీకి కేసీఆర్ ఫిక్స్ ?


ఇన్ని కారణాలు కనిపిస్తుండటంతో కేసీఆర్ కు .. ఢిల్లీ కి దోస్తీ కుదిరింది అని మిగతా పక్షాలు రూఢీ చేసుకుంటున్నాయి. అయితే బీఆరెఎస్ దీనిని డిఫెండ్ చేసుకుంటున్న తీరు వేరే లాగా ఉంది. దేశంలోని సమస్యలన్నింటికీ కాంగ్రెస్సే కారణం అని... అలాంటి కాంగ్రెస్ భాగస్వామ్యం వహించే.. నేతృత్వం వహించే ప్రతిపక్షాల కూటమిలో తామెందుకు ఉంటామని బీఆరెఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్- బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని అందుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని.. కేటీఆర్ స్పందించారు.  ఇదిలా ఉంటే.. బీజేపీ ఇంకో రకంగా స్పందిస్తోంది. మోదీని గద్దె దింపాలన్నదే కేసీఆర్.. కాంగ్రెస్ లక్ష్యమని.. ఆ రకంగా ఆ రెండు పార్టీలు ఒకటేనని చెబుతోంది. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేసి ఉంటే.. ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరేదని.. అలా జరగకూడదనే పోటీకి దిగలేదని వారు ఆరోపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్‌కు ఆర్థిక సాయం కూడా చేశారని ఆరోపిస్తున్నారు. ఇదీ తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో పొలిటికల్ పార్టీల తీరు. 


తెలంగాణలో చిన్న పార్టీలు ఎట వైపు ? 


ఇవి ఇలా ఉంటే కొత్తగా వచ్చిన RS ప్రవీణ్‌కుమార్, కొత్తగా పుట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఎవరి టీమో ఆర్థం కాని పరిస్థితి ఉంది. షర్మిళను బీజేపీయే తీసుకొచ్చిందని చాలా ప్రచారం జరిగింది. ఇప్పుడేమో ఆవిడ కాంగ్రెస్‌ తో కలిసి నడిచేందుకు రెడీ అవుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఈ మధ్య కాలంలో కేసీఆర్ బీజేపీ వైపు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారన్నది మాత్రం అయితే క్లియర్. కాంగ్రెస్ ను ఎక్కడ ప్రతిపక్షంగా గుర్తిస్తే.. తనకు పోటీ అవుతుందేమో అన్న కారణంతో అసలు గ్రౌండ్ లో బలంలో లేని బేజేపీ పైకి లేపిన వ్యూహం ఫలించినట్లుగా కనిపించడం లేదని.. ఇక కాంగ్రెస్ తో హోరాహోరీకి కేసీఆర్ ఫిక్స్ అయిపోయారని ఆయన పొలిటికల్ గేమ్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. చూద్దాం.. ఏం జరుగుద్దో..