Anvesh Instagram was banned:  వివాదాస్పద యూట్యూబర్  నా అన్వేషణ అన్వేష్  ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను  శాశ్వతంగా తొలగించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, హిందూ దేవతలను,భారతదేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందున హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు తొలగింపచేశారు. 

Continues below advertisement

మత విద్వేషాల ఆరోపణలు 

ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వీడియోలు చేసే అన్వేష్, గత కొంతకాలంగా తన సోషల్ మీడియా వేదికల ద్వారా భారతదేశంపై ,  హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై నటి  కరాటే కల్యాణి  తీవ్రంగా స్పందించారు. అన్వేష్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, దేశ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని పేర్కొంటూ ఆమె హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్స్‌కు పోలీసుల లేఖ 

ఈ ఫిర్యాదును స్వీకరించిన సిసిఎస్ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. అన్వేష్ అకౌంట్ ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని నిర్ధారించుకున్న పోలీసులు, వెంటనే ఇన్‌స్టాగ్రామ్ ఫౌండర్స్‌కు, నిర్వాహకులకు లేఖ రాశారు. అన్వేష్ అకౌంట్ వివరాలు కావాలని కోరడంతో పాటు, అతను పోస్ట్ చేసిన వివాదాస్పద కంటెంట్ గురించి ఆ లేఖలో వివరించారు. సిసిఎస్ పోలీసులు తమ లేఖలో స్పష్టమైన ఆధారాలను పొందుపరిచారు. సమాజంలో అశాంతిని కలిగించేలా, మతపరమైన చిచ్చు పెట్టేలా ఉన్న ఈ అకౌంట్‌ను వెంటనే తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యాన్ని కోరారు. పోలీసుల నుండి వచ్చిన ఫిర్యాదును మరియు లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులు, అన్వేష్ అకౌంట్ తమ నిబంధనలను  అతిక్రమించిందని భావించి, దానిని వెంటనే బ్యాన్ చేశారు.

తగ్గిన ఫాలోవర్లు 

ఒకప్పుడు 1.8 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న నా అన్వేషణ  ఇన్‌స్టాగ్రామ్ పేజీ, అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. అకౌంట్ బ్యాన్ అయ్యే సమయానికి ఆ సంఖ్య 1.3 మిలియన్లకు పడిపోయింది. భారతదేశం,  దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే నెటిజన్లు అతనికి దూరమయ్యారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.         

 శిక్ష పడిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు 

ప్రస్తుతం అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సెర్చ్ చేసినా కనిపించడం లేదు. హిందూ దేవతలను దూషించినందుకు, దేశంపై విషం చిమ్మినందుకు అన్వేష్‌కు తగిన శిక్ష పడిందని పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించని ఏ వ్యక్తికైనా ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.