అదిలాబాద్ కలెక్టర్ ఎదుట అంగన్వాడి కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను మహిళా పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన మొదలైంది. అదిలాబాద్ కలెక్టరేట్ లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను మహిళ అడ్డుకున్నారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై ధనశ్రీని కార్యకర్తలు చుట్టుముట్టి జుట్టు లాగారు. అంగన్వాడి కార్యకర్తల నుంచి మహిళ ఎస్సై తప్పించుకుంది. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు భారీగా కలెక్టరేట్ కు తరలి రావడంతో కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా పోలీసులు తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.






గత కొన్ని రోజుల నుంచి అంగన్వాడీల సమ్మె....
గత కొన్ని రోజుల నుంచి అంగన్వాడి కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. అంగన్వాడి కార్యకర్తలు, ఆయాల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ గత కొన్ని రోజుల నుంచి వీరు సమ్మెకు దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి వరకు అంగన్వాడి కార్యకర్తలను ఉద్యోగులుగా గుర్తించలేదని వెల్లడించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించక పోగా పని భారం పెంచుతూ మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని అంగన్వాడి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయంలో కూడా అంగన్వాడీలు కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టింగ్ అనే పదం ఉండదని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పారు కానీ ఇది ఎక్కడ అమలు చేయలేదని వెల్లడించారు.


గ్రామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాం.....
అంగన్వాడి కార్యకర్తలు గ్రామాల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా గర్భిణీలు, చిన్నపిల్లల ఆలనా పాలన, వారికి పోషకాహారం తదితర వాటిని తామే చూసుకుంటున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం ప్రవేశపడితే ఇంటింటికి తిరుగుతూ వాటిని ప్రజలకు  అవగాహన కల్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని వెల్లడించారు. శాఖపరమైన పనులతో పాటు, ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా తామే చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంత చేస్తున్న గాని ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదని వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు సూచించిన సూచనల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆ తీర్పును ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


5 వేల కనీస వేతనం అమలు చేయాలి....
ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 25వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. అంతేకాకుండా పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం అమలు చేయాలని కోరుతున్నారు. డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని గత కొన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు.