Allahabad High Court Key Verdict on Gyanvapi Case: వారణాసిలోని జ్ఞానవాపి (Gyanvapi) మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్ పై ముస్లిం సంఘాలు వేసిన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు (Allahabad Highcourt) మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి (Varanasi) కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ కొట్టేయాలని దాఖలు చేసిన 5 పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే, ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ, ఈ కేసుకు సంబంధించి విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ మసీదు సంఘాలు వేసిన పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. వారణాసి కోర్టులో ఉన్న పిటిషన్ ను ప్రార్థనా స్థలాల చట్టం - 1991 నిరోధించలేదని స్పష్టం చేశారు. 


ఇదీ జరిగింది


మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, 2021, ఏప్రిల్ 8న మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని (ASI) ఆదేశించింది. ఈ క్రమంలో చేసిన సర్వేలో ఓ శివలింగం ఆకారం బయటపడింది. అయితే, అది శివలింగం కాదని మసీదు నిర్వాహకులు వాదిస్తున్నారు. అలాగే, సర్వేపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ - AIMC, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారించిన ధర్మాసనం ముస్లిం సంఘాల పిటిషన్లను కొట్టేసింది. 


Also Read: రామాలయం ప్రారంభోత్సవానికి అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ రావొద్దన్న అయోధ్య ట్రస్ట్