Air India Boeing 787 Dreamliner defect in the fuel control switch : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఇంధన నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం హాట్ టాపిక్ గా మారింది. అహ్మదాబాద్ ప్రమాద ఘటన గుర్తుకు వచ్చేలా ఉండటంతో సంచలనంగా మారింది. లండన్-బెంగళూరు విమానంలో కలకలం
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ (VT-ANX) విమానం లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న తర్వాత, పైలట్లు అందులోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో లోపాన్ని గుర్తించారు. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో స్విచ్ రన్ పొజిషన్లో లాక్ అవ్వకుండా, దానంతట అదే కటాఫ్ వైపు మళ్లుతోందని వారు ఫిర్యాదు చేశారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయి అవి ఆగిపోయే ప్రమాదం ఉండటంతో, ఎయిర్ ఇండియా తక్షణమే స్పందించి ఆ విమానాన్ని గ్రౌండింగ్ చేసింది. దీనిపై తయారీ సంస్థ బోయింగ్ , విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కి సమాచారం అందించారు.
అహ్మదాబాద్ ప్రమాదం తెచ్చిన భయం
ఈ తాజా ఘటనపై ఇంతటి ఆందోళన కలగడానికి ప్రధాన కారణం గత ఏడాది జరిగిన ఘోర విమాన ప్రమాదమే. 2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే ఎయిర్ ఇండియాకు చెందిన మరో డ్రీమ్లైనర్ విమానం (AI 171) కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో 260 మంది మరణించారు. ఆ విమాన ప్రమాదంపై జరిగిన ప్రాథమిక విచారణలో, రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు రన్ నుంచి కటాఫ్ కు మారడం వల్ల ఇంధనం అందక ఇంజిన్లు ఆగిపోయాయని వెల్లడైంది. తాజా ఘటనలో కూడా సరిగ్గా అదే రకమైన లోపం కనిపించడం భద్రతా పరమైన ఆందోళనలను రెట్టింపు చేసింది.
గతంలో తనిఖీలు
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత, డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన వద్ద ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాల ఫ్యూయల్ స్విచ్లను తనిఖీ చేసింది. ఆ సమయంలో ఏ విమానంలోనూ లోపాలు లేవని సంస్థ ప్రకటించింది. అయితే, తాజా ఫిర్యాదుతో ఆ తనిఖీల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా విమానయాన సంస్థ ఎఫ్ఏఏ కూడా గతంలోనే ఇలాంటి స్విచ్ల లోపాలు ఇంజిన్ షట్డౌన్కు దారితీస్తాయని హెచ్చరించింది. ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఇతర విమానాలపై కూడా దృష్టి సారించింది.
తీవ్రమైన లోపమే
విమానయాన నిపుణులు ఈ లోపాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. గతంలో లోపాలు లేవని చెప్పిన విమానంలోనే ఇప్పుడు సమస్య రావడం విస్మయానికి గురిచేస్తోంది అని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం బోయింగ్ ఇంజనీర్లు , డీజీసీఏ అధికారులు ఈ విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా పేర్కొన్నప్పటికీ, డ్రీమ్లైనర్ విమానాల డిజైన్ లేదా మెకానికల్ సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఇప్పుడు బోయింగ్ సంస్థపై ఉంది.
