Adani Group Data Centre: ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఏకంగా, రూ. 21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ పట్నంలోని మధుర వాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయల చొప్పున 190.29 ఎకరాలను అదానీ గ్రూపుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 


ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి


అదానీ గ్రూపు పెట్టదలచిన డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి లభించనుంది. మొదట 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అదానీ గ్రూపు.. ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. మే 3న అదానీ గ్రూపు అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డేటా సెంటర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. 


40 మెగావాట్ల డేటా సెంటర్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడి


ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కారు వీటీపీఎల్ తో ఒప్పందం చేసుకుంది. మొత్తం 5 దశల్లో ఈ ప్రాజెక్టును మొత్తంగా 7 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటీపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది. మొదటి దశలో మూడేళ్ల కాలంలో కనీసం 40 మెగావాట్ల డేటా సెంటర్ ను అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు 30 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాల్సి ఉంటుందని ఏపీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 4 సంవత్సరాల్లో 50 శాతం మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఏడేళ్లలో పూర్తిగా 39,815 మందికి ఉపాధి కల్పించాలని స్పష్టంగా పేర్కొంది.


130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్ కే..!


300 మెగావాట్ల డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32 వేల మందికి పైగా ఉపాధి దొరకనుంది. అలాగే స్కిల్ కాలేజీ, రీక్రియేషన్ సెంటర్ల ద్వారా మరో 3 వేల మందికిపైగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొదట కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్ కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కాలేజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ కేంద్రానికి 9 ఎకరాలను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. భూమి పూజ జరిగిన తర్వాత వెను వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ముందుగా స్పష్టంగా చేసినట్లుగా నిర్దిష్ట వ్యవధిలో పనులు పూర్తి కావడంతో పాటు ఉపాధి లభించనుంది.