Post-poll violence Bengal 2026:  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ సెకండ్-ఇన్-కమాండ్, ఎంపీ  అభిషేక్ బెనర్జీపై  సోనార్‌పూర్‌లో జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎన్నికల అనంతర హింస  బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనపై జరిగిన ఈ దాడికి బీజేపీయే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  

Continues below advertisement

 అభిషేక్ బెనర్జీపై దాడి 

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో పర్యటిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో దెబ్బతిన్న పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఆయన కాన్వాయ్ గ్రామంలోకి ప్రవేశించగానే కొందరు దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో అభిషేక్ బెనర్జీ వాహనంతో పాటు భద్రతా సిబ్బందిపై కూడా రాళ్ల దాడి జరిగినట్లు బెంగాలీ మీడియా నివేదించింది.  

Continues below advertisement

ఈ దాడిపై అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు.  ఇదంతా బీజేపీ స్పాన్సర్ చేసిన దాడి. వారి ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనం. ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే తమ ఓటమిని తట్టుకోలేక ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. కనీసం శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా అక్కడ కనిపించలేదు అంటూ మండిపడ్డారు. బీజేపీ గూండాలే పక్కా ప్రణాళికతో తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు.  

అభిషేక్ బెనర్జీ సోనార్‌పూర్ సందర్శన గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ, తగిన భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాడి జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, ఇది ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమని టీఎంసీ నేతలు వాదిస్తున్నారు.  

 ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది టీఎంసీలోని అంతర్గత విభేదాల వల్ల జరిగిన దాడి అని, బీజేపీకి దీనితో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. కేవలం సానుభూతి కోసమే అభిషేక్ బెనర్జీ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, సంఘటనా స్థలంలో బీజేపీ జెండాలు కనిపించాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఈ ఘటనతో సోనార్‌పూర్‌తో పాటు సమీప ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో, సాక్షాత్తు ఒక ఎంపీపైనే దాడి జరగడం రాష్ట్రంలో రాజకీయ అశాంతికి నిదర్శనంగా మారుతోంది. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.