Trains Cancellation: రైల్వే అధికారులు సోమవారం నుంచి 47రోజులుపాటు 26 రైళ్ళను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. రద్దు పద్దులో చేరిన రైళ్లు జాబితాలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్ప్రెస్ సహా డిమాండ్ ఉన్న అనేక రైళ్లు ఉన్నాయి. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆకస్మికంగా రైళ్లు రద్దు చేయడం పట్ల రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 30 వేళ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కనీసం 15 వేల మంది నుంచి 30 వేల మంది వరకు ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. వీరంతా తాజాగా రైలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.  ప్రత్యామ్నాయంగా ఇంటర్ సిటీ వంటి రైళ్ళను నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా 47 రోజులపాటు అనేక ఎక్స్ప్రెస్ రైళ్ళను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకోవడం ప్రయాణికులు ఆగ్రహానికి కారణమవుతోంది. 


రద్దుకు రైల్వే అధికారులు చెబుతున్న కారణాలు ఇవే..


తాజాగా ఎక్స్ప్రెస్ రైలు రద్దు చేయడానికి పలు కారణాలు ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన ఆధునీకి పనులు జరుగుతున్నాయి. ఈ కారణంతోనే తరచుగా సింహాద్రి, రాయగడ ఎక్స్ప్రెస్ లను రద్దు చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్ రైళ్లు నడుస్తుండడంతో ప్రయాణికులకు పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ, ఒకేసారి ఎక్స్ప్రెస్ రైళ్ళను కూడా రద్దు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ వెళ్లే ప్రయాణికులు అధిక శాతం జన్మభూమి రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. చార్జీలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. రోజుకు 2000 మంది ప్రయాణం చేస్తారని అంచనా. మూడు రైళ్లులో సుమారు 6000 మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. రాయగడ ఎక్స్ప్రెస్ కూడా తీసుకుంటే ఈ సంఖ్య పదివేలపైనే ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే స్థాయిలో జనాలు ఆశ్రయిస్తారు. ప్రతిరోజు సుమారు 20,000 మంది ప్రయాణికుల రాకపోకలకు కీలకంగా మారినా ఈ రైలును రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అనేక రైళ్లను రద్దు చేస్తున్నారు. కనీసం మూడింటిలో ఒక్క రైలు అయినా నడపాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. పనులు జరిగే కొద్దీ పది రోజుల్లో రద్దు చేసిన కొన్ని రైళ్లను తిరిగి పట్టాలపైకి ఎక్కించే అవకాశం ఉందని చెబుతున్నారు. 


ఉమ్మడి తూర్పుగోదావరి పరిసర ప్రయాణికులకు ఇబ్బందులు..


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మీదుగా వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టుగా జిల్లా కేంద్రాల్లో రైల్వే శాఖ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసింది. ప్రధానమైన రైళ్లను కూడా దాదాపు 45 రోజులపైగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా రాజమండ్రి, సామర్లకోట, పిఠాపురం, తుని రైల్వే స్టేషన్లలో ఎక్కువగా ప్రజల జన్మభూమి రైలు ఎక్కుతుంటారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు రాజమండ్రి నుంచి తుని, సామర్లకోట నుంచి రాజమండ్రి ఇలా అనేక ప్రాంతాలకు వీరంతా అప్ అండ్ డౌన్ ప్రయాణాలను ఈ రైలులో సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ రైలును సోమవారం నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రద్దు చేయడం పట్ల విద్యార్థులు, ఉద్యోగస్తులు సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టులు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు సింహాద్రి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు అయినట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించడం పట్ల ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి పాసెంజర్, అదే విధంగా కాకినాడ పాసింజర్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రాయగడ పాసింజర్, గుంటూరు- విశాఖపట్నం పాసింజర్ సహా దాదాపు తొమ్మిది రైళ్లను రద్దు అయినట్లుగా రైల్వే స్టేషన్లలో అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిడదవోలు - కడియం మధ్య ఆధునీకరణ పనులు కారణంగా ఈ రైళ్లు రద్దు అయినట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ప్రయాణికులు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.