Daughter Of Prasad Rao Kanabadutaledu Review - 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' రివ్యూ: జీ5 ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review - Daughter Of Prasad Rao Kanabadutaledu On Zee5: రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
కృష్ణ పోలూరు
రాజీవ్ కనకాల, వాసంతిక, ఉదయభాను, గాయత్రీ భార్గవి, బిందు చంద్రమౌళి, జెమినీ సురేష్ తదితరులు
Rajeev Kanakala Latest Web Series Daughter Of Prasad Rao Kanabadutaledu Review In Telugu: తండ్రి పాత్రలకు రాజీవ్ కనకాల కేరాఫ్ అడ్రస్గా మారుతూ... వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే... ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. రాజీవ్ కనకాల కుమార్తెగా వాసంతిక నటించారు. ఉదయభాను, గాయత్రీ భార్గవి, బిందు చంద్రమౌళి, జెమినీ సురేష్ ఇతర ప్రధాన తారాగణం. ఫిబ్రవరి 27 నుంచి 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉంది?
కథ (Daughter Of Prasad Rao Kanabadutaledu Story): చిత్తూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) కిరాణాకొట్టు వ్యాపారి. ఆయన ఒక్కగాన ఒక్క కుమార్తె పేరు స్వాతి (వాసంతిక). ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ అమ్మాయికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. అప్పటివరకు తమతో పెరిగిన అమ్మాయిని ఉద్యోగానికి పంపడానికి తొలుత సందేహించినా... తర్వాత అంగీకరిస్తాడు ప్రసాద్ రావు.
హైదరాబాద్ వచ్చిన స్వాతి... ఉద్యోగంలో చేరుతుంది. భవాని (గాయత్రీ భార్గవి) హాస్టల్లో ఉంటూ రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తుంది. నెల సవ్యంగా ఉంటుంది. ఒక రోజు రాత్రి స్వాతి ఫోన్ స్విఛ్ ఆఫ్ రావడంతో కంగారుగా హైదరాబాద్ బయలు దేరతాడు ప్రసాద్ రావు. మరోవైపు స్వాతి కనిపించడం లేదని హాస్టల్ వార్డెన్ భవాని కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది.
స్వాతి మిస్సింగ్ కేసును రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) ఎలా సాల్వ్ చేశారు? డైలీ స్వాతిని ఫాలో అయ్యే అబ్బాయి ఎవరు? ఊరిలో జరిగిన ఓ ఘటనకు, ఈ మిస్సింగ్ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Daughter Of Prasad Rao Kanabadutaledu Review): ఓటీటీ వీక్షకుల్లో 'రెక్కీ' వెబ్ సిరీస్కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే, ఆ సిరీస్ దర్శకుడు కృష్ణ పోలూరు తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. ఈ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'కు కూడా ఆయన దర్శకుడు. దానికి తోడు రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక వంటి తారాగణం ఉండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి, వాటిని అందుకునేలా సిరీస్ ఉందా? లేదా? అంటే...
'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' టైటిల్, ప్రచార చిత్రాలు చూస్తే... ఇదొక మిస్టరీ థ్రిల్లర్ అనుకుంటాం. కానీ, ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. వీక్షకులకు సందేశం ఇచ్చే ఫ్యామిలీ కథతో రూపొందిన సిరీస్. ఉద్యోగం కోసం సొంతూరు వదిలి సిటీ వచ్చే అమ్మాయిలు ఎంతో మంది. అటువంటి ఆడపిల్లల తండ్రుల మదిలో ఆందోళన - ఒకవేళ వాళ్ళు కనిపించపోతే పడే ఆవేదన... సిటీల్లో అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలు... అన్నిటినీ టచ్ చేశారు దర్శకుడు కృష్ణ పోలూరు.
'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు' సిరీస్ ప్రారంభం బావుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది. అయితే త్వరగా థ్రిల్ నుంచి ఫ్యామిలీ వైపు వెళుతుందీ కథ. అమ్మాయి మిస్సింగ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్యారలర్గా నడిచే మరొక చైల్డ్ హుడ్ ఎపిసోడ్... ప్రతిదీ క్యూరియాసిటీ కలిగిస్తూ ముందుకు తీసుకు వెళతాయి. అయితే ఏదో ఒకటి మిస్సైన ఫీలింగ్ మరొకవైపు ఉంటుంది. ఆ వెలితిని ఆఖరి ఎపిసోడ్లో పూడ్చారు దర్శకుడు. బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు రివీల్ చేస్తూ అప్పటి వరకు మిస్సైన థ్రిల్ ఒక్కసారిగా ఇచ్చారు.
Also Read: Nawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?
'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'కు హైలైట్ మిస్సింగ్ మిస్టరీ లేదా క్రైమ్ లేదా థ్రిల్ ఇచ్చే ట్విస్టులు మాత్రమే కాదు. అంతకు మించి సిరీస్ చివరిలో ఉదయభాను చేత చెప్పించిన ఓ మాట. 'జాగ్రత్తకు, భయానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ధైర్యంతో' అంటూ సందేశం ఇచ్చారు. అంతకు ముందు అమ్మాయిలకు ఏదైనా చెప్పుకొనే స్వేచ్ఛ తండ్రులు ఇవ్వాలంటూ మరొక మాట చెప్పారు. అదీ పేరెంట్స్ చాలా మందిని టచ్ చేసే అంశమే. ఈ సిరీస్కు టెక్నికల్ వేల్యూస్ సోసోగా ఉన్నాయి. డైలాగుల్లో విషయాన్ని క్లుప్తంగా చెప్పారు శృతి. యాసను జోడించడం వల్ల నేటివిటీ కనిపించింది. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్ పర్వాలేదు. ఓటీటీ కనుక క్వాలిటీ విషయంలో రాజీ పడినట్టు ఉన్నారు. సాలిడ్ పెర్ఫార్మన్స్లపై ఎక్కువ ఆధారపడ్డారు.
రాజీవ్ కనకాల నటనలో సిన్సియారిటీ కనిపించింది. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్లో ఆయన నటన తండ్రి ఆవేదనను ఆవిష్కరించింది. అంతకు ముందు కీలకమైన ట్విస్ట్ రివీల్ అయిన సందర్భంలోనూ రాజీవ్ కనకాల భావోద్వేగభరిత నటన ప్రతి అమ్మాయి తండ్రిని కంటతడి పెట్టించేలా సాగింది. ఈతరం అమ్మాయిగా స్వాతి ఒదిగిపోయింది. పోలీస్ ఆఫీసర్ రెబెక్కా జోసెఫ్ పాత్రలో ఉదయభాను సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సినిమాలకూ తాను బెస్ట్ ఛాయస్ అని చెప్పేలా ఆమె నటన సాగింది. బాడీ లాంగ్వేజ్ గానీ, నటన గానీ వంక పెట్టడానికి లేదు. కాన్ఫిడెంట్గా కనిపించారు. ఈ సిరీస్లో గాయత్రీ భార్గవి సర్ప్రైజ్ ప్యాకేజ్. క్లైమాక్స్లోని కీలమైన సన్నివేశంలో ఆవిడ మామూలు షాక్ ఇవ్వలేదు. బిందు చంద్రమౌళి, జెమినీ సురేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు... ఇది మిస్టరీ థ్రిల్లర్ కాదు, వీక్షకులకు చక్కటి సందేశం ఇచ్చే ఎమోషనల్ థ్రిల్లర్. థ్రిల్ కోసం ఆఖరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. కథ కొత్తగా లేకపోవడం మైనస్. కానీ, సందేశం ఆకట్టుకుంటుంది. కుటుంబ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులు మిస్సవ్వకుండా చూడాల్సిన సిరీస్ ఇది. సమాజంలో అమ్మాయిలకు ఎదురయ్యే ఓ సమస్య నేపథ్యంలో తండ్రీ కుమార్తెల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ... కృష్ణ పోలూరు ఓ చక్కటి సిరీస్ తీశారు. రాజీవ్ కనకాల, ఉదయభాను నటన సిరీస్ స్థాయిని పెంచింది.























