ప్రతి ఆహార పదార్థానికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది.మార్కెట్లలో ప్యాకెట్ల రూపంలో కొన్న ఆహారానికి ఆ ప్యాకెట్ల పైనే ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. దాని కన్నా ముందే ఆహారాలని ఉపయోగించేయాలి అని అర్థం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇచ్చిన తేదీ కన్నా ముందే కొన్ని రకాల ఆహారాలు పాడైపోతాయి. అవేంటో తెలుసుకుని ముందే వాడేయాల్సిన అవసరం ఉంది. 


ఓట్స్
ఓట్స్ ఇప్పుడు అందరి ఇళ్లలో కనిపిస్తున్నా ఆహారంగా మారింది. ఇది మనదేశంలో పండనప్పటికీ ఇక్కడ మనం విరివిగా ఉపయోగిస్తున్నాం. రోజూ ఓట్స్ ను తినేవాళ్లున్నారు. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం, బరువు తగ్గాలనుకునేవారు వీటిని తమ రోజువారీ డైట్‌లో భాగం చేసుకున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో ఓట్స్ కూడా ఒకటి. కానీ ఓట్స్ ప్యాకెట్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ కన్నా ముందే అవి పాడవ్వడం ప్రారంభమవుతాయి. వీటిని కొన్నాక కేవలం 4 నుంచి ఆరునెలల్లోనే ఉపయోగించేయాలి. అందుకే ఓట్స్‌ను అధిక మొత్తంలో ఒకేసారి కొనకుండా చిన్న ప్యాకెట్లుగా కొనుక్కుని వాడుకోవడం ఉత్తమం. 


పిండి
ఏ రకమైన పిండి కొన్నా అది మైదా కావచ్చు, గోధుమపిండి, బియ్యంపిండి... ఇలా ఏదైనా కూడా కొన్ని తరువాత త్వరగా వాడేయాలి. ఇలాంటి పిండి రకాలను ఏళ్లకు ఏళ్లు వాడేస్తుంటారు చాలా మంది. కానీ ఏ పిండైనా మూత పెట్టి గాలి చొరబడకుండా ఉంటే తొమ్మిది నెలల వరకు ఫర్వాలేదు. అందుకే అలాంటి పిండిలను ఏడాదిలోపే వాడేయాలి. ఆ తరువాత అవి చాలా మార్పులకు గురవుతాయి. పురుగు పట్టే అవకాశం ఉంది. పోషకాలు మాత్రం కచ్చితంగా తగ్గిపోతాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కూడా. 


క్యాన్డ్ ఫుడ్
సూపర్ మార్కెట్లలో ఎన్నో రకాల క్యాన్డ్ ఫుడ్ అందబాటులో ఉంటుంది. టిన్ లు, క్యాన్లలో భద్రపరిచిన ఆహారాలను ప్రజలు వాడడం కూడా అధికమే. అందుకే చాలా అధికంగా ప్రిజర్వేటివ్స్ ఉపయోగిస్తారు. క్యాన్డ్ పుడ్స్ పై ఎక్స్‌పైరీ తేదీని నమ్మకపోవడమే మంచిది. ఇలాంటి వాటిని ఏడాదిలోపే తినేయడం చాలా మంచిది. ఏ ఆహారమైన అధికంగా నిల్వ ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. 


నూనెలు 
కొంతమంది నూనెలు ఎన్నాళ్లైనా పాడవవు అని అనుకుంటారు, మూత తీయకుండా ఉండే ఎన్నాళ్లైనా వాటిని నిల్వ చేయచ్చు అనుకుంటారు. మూత తెరవని నూనె డబ్బాలను రెండేళ్ల లోపే వాడుకోవాలి. మూత తీశాక మాత్రం త్వరగానే పూర్తి చేసేయాలి. నూనె నిల్వ ఉంటున్న కొద్దీ దాని వాసన, రుచి మారిపోతుంది. అంతేకాదు నూనె నిల్వ చేయాలనుకుంటే వేడి తగలని ప్రాంతాల్లోనే ఉంచాలి. 


కూరగాయలు
కొన్ని కూరగాయలు వేరే దేశాల నుంచి మనకు దిగుమతి అవుతాయి. అలాంటి వాటిలో అధికంగా ఉండేవి బ్రోకలీ, పుట్టగొడుగులు, బెల్ పెప్పెర్స్, సెలెరీ, లెట్యూస్ వంటివే. వాటిని కొన్న తరువాత వారం రోజుల్లోపే వండుకుని తినేయాలి. ఎందుకంటే అప్పటికే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండి మీ వద్దకు చేరి ఉంటాయి. కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల ఉపయోగం లేదు. 


Also read: మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం


Also read: కాఫీ మరింతగా ఆస్వాదించాలా? వీటిని మిక్స్ చేసుకుని తాగితే ఆ కిక్కే వేరు


























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.