ఒక్కో విమానంలో ఒక్కో రకమైన ఫుడ్ పెడతారు. కానీ, అవి అంత టేస్టీగా ఉండదు. ఇంత డబ్బు చెల్లిస్తే ఇలాంటి ఫుడ్ పెట్టారేంటనే ఆశ్చర్యం కలిగేలా ఉంటుంది. అయితే, ఇందుకు ఒక కారణం ఉంది. అదేంటో చివరి పేరాలో తెలుసుకుందాం. కానీ, ఓ విమానంలో మాత్రం.. ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలి ఫుడ్‌లో దవడ పళ్లు కనిపించాయి. దీంతో ఆమెకు గుండె జారినంత పనైంది. 


ఘడా అనే మహిళ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ BA107 విమానంలో లండన్‌ నుంచి దుబాయ్‌కి ప్రయాణమైంది. విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి సిబ్బంది ఘడాకు కూడా ఆహారం ఇచ్చారు. సిబ్బంది ఇచ్చిన ఆహారంలో దంతం వచ్చింది. దీంతో షాకైన ఆమె.. అది ఫొటో తీసి ట్విటర్‌‌లో పోస్ట్ చేసింది. ‘‘నా నోటి పళ్ళు సరిగ్గానే ఉన్నాయి. ఈ దంతం నాది కాదు. వీళ్లు ఇచ్చిన ఆహారంలో పళ్ళు చూసి, షాక్‌ అయ్యా’’ అంటూ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ. ఇలా జరిగినందుకు సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది.  ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా జాగ్రత్త తీసుకుంటామని తెలిపింది. 


మీకు ఇలా జరిగితే కోర్ట్‌ను ఆశ్రయించవచ్చు!


విమానంలోనే కాదు, మనం బయట ఆహారం తీసుకొనేప్పుడు తప్పకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఒక వేళ మీరు విమానంలో తీసుకున్న ఆహారం సుచిగా లేకపోయినా, వాటిలో ఏమైనా కనిపించినా, పాచి పట్టినట్లు గుర్తించినా.. వెంటనే ఫిర్యాదు చేయాలి. దీనిపై మీరు జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. ఒకవేళ మీకు అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. సంబంధిత రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో కూడా కేసు వేసి, ఆ ఏయిర్‌లైన్స్‌ సంస్థకు జరిమాన వేయవచ్చు. ఇలా కేసులు వేసి, కోర్టులో భారీ మొత్తంలో సదరు విమాన సంస్థలకు ఫైన్‌ వేసిన ఘటనలు చాలానే ఉన్నాయి.


మాలతీ మధుకర్ పహడే అనే మహిళకు ఓ విమానంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె ఆ విమాన సంస్థపై కేసు వేసి మరీ గెలిచింది. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఆమెకు విమాన సిబ్బంది పాచిపోయిన ఆహారాన్ని ఇచ్చారు. అంతేగాక ఆ అన్నంలో వెంట్రుకలు కూడా ఉన్నాయి. పెరుగు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉంది. దీంతో ఆమె అది తినకుండ ప్రయాణం కొనసాగించింది. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఎయిరిండియాకు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును ఎయిరిండియా రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో సవాల్ చేసింది. అయితే, రాష్ట్ర ఫోరం ఆ జరిమానాను రూ.లక్షకు పెంచడంతో ఎయిరిండియా మళ్లీ జాతీయ కమిషన్‌లో పిటిషన్ వేసింది. దీనిని కొట్టేసిన జాతీయ కమిషన్ ప్రయాణికురాలికి రూ.లక్ష చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ, ఆదేశించింది.


విమానంలోని ఆహారం ఎందుకు టేస్ట్‌గా ఉండదు?


చాలామంది విమానంలో పెట్టే ఫుడ్‌పై ఫిర్యాదులు చేస్తుంటారు. అస్సలు రుచిగా లేదని అంటారు. అయితే, మీరు ఎంత రుచికరమైన ఆహారాన్ని విమానంలోకి తీసుకెళ్లినా.. విమానంలో గాల్లో ఉన్నప్పుడు మాత్రం అంత టేస్టీగా ఉండదు. ఎందుకంటే.. విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు పొడిగాలి వల్ల మన నాలుక మీద ఉండే టేస్ట్‌ బడ్స్‌ సెన్సిటివిటీ బాగా తగ్గిపోతుంది. దీని కారణంగా 30 శాతం వరకు రుచి తెలియకుండా పోతుంది. అంతేకాదు.. ముక్కులో ఉండే నాసల్‌ ప్యాసేజ్‌లోని మ్యూకస్‌ పదార్థం కూడా డ్రైగా అయిపోతుంది. అందుకే, మనకు విమానంలో ఉన్నప్పుడు ఆహారం అంత రుచిగా అనిపించదు. 


Also Read: దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..