తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ‘ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుంది. కావాలంటే చేసి చూడండి’ అన్నారు. పిల్లలంతా 13 ను 13తో, 84 ను 84తో... ఇలా ఎవరికి నచ్చిన అంకెల్ని అదే అంకెతో భాగించి చూసి అవును అని తలాడించారు. కానీ ఒక బక్కపలుచటి పిల్లవాడు మాత్రం నిల్చుని ‘మరి సున్నాను సున్నతో భాగిస్తే ఒకటి రాలేదే’ అని అడిగాడు. చిన్న పిల్లవాడు ఆ ప్రశ్న అడుగుతాడని ఊహించలేకపోయాడు గణిత ఉపాధ్యాయుడు. ఆరోజు అలా  అడిగిన పిల్లాడు తరువాత ఎన్నో గొప్ప గణిత సిద్ధాంతాలను  కనిపెట్టి ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్తగా ఎదిగారు. ఆ పిల్లాడి పూరి పేరు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. 












పిచ్చి కుదురుతుందని పెళ్లి చేశారు
1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో జన్మించారు. స్కూల్లో చేరకముందు నుంచే ఏదో ఒక లెక్కలు చేసుకుంటూ కూర్చునేవారు. పదిహేనేళ్లకే బీజగణితం, త్రికోణమితి, రేఖాగణితం... దాదాపు గణిత శాస్త్రంలోని సిద్ధాంతాలన్నింటినీ ఔపోసన పట్టేశారు. కాగితం కనిపిస్తే చాలు వాటి మీద ఏవో గణిత సిద్ధాంతాలు రాసేవారు. తెల్లకాగితాలు దొరకకపోతే వాడిన కాగితాల మీదే మరో ఇంకు పెన్నుతో రాసుకునేవారు. లేచినప్పటి నుంచి గణితం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. దీంతో రామానుజన్ తల్లిదండ్రులు భయపడ్డారు. ముఖ్యంగా తండ్రి తన కొడుకు పిచ్చివాడైపోతాడేమో అని బెంగ పెట్టుకున్నారు. పిచ్చి కుదర్చాలంటే పెళ్లి చేయమని సలహాలిచ్చారు చుట్టుపక్కల ఉన్న కొంతమంది పెద్దలు. దీంతో జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ల అమ్మాయితో రామానుజానికి పెళ్లి చేశారు. 


డబ్బుల్లేక...
రామానుజానిది పేద కుటుంబమే. తండ్రి గుమస్తాగా ఓ దుకాణంలో పనిచేసేవారు. గణిత సిద్ధాంతాల కోసం 70 తెల్ల కాగితాలు అవసరమయ్యేవి. అవి కొనడానికి కూడా డబ్బుల్లేక చెత్తకుండీల్లో కాగితాల కోసం వెతికేవారు. పెళ్లయ్యాక సంసార సాగరాన్ని ఈదేందుకు ఓ దుకాణంలో గుమస్తాగా చేరారు. నెలకు పాతిక రూపాయల జీతం. అయినా కూడా రామానుజం మారలేదు. అక్కడ కూడా కాగితం కనిపిస్తే లెక్కలే. లెక్కల మీద ఉన్న అమిత ప్రేమ, ఆసక్తి అతడిని మిగతా సబ్జెక్టులు రాకుండా చేసింది. దీంతో పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేకపోయారు. 


కలెక్టర్ సాయం
అప్పట్లో రామస్వామి అనే డిప్యూటీ కలెక్టర్ కు గణితం అంతే ఆసక్తి ఉండేది.  అతను ఒక గణిత శాస్త్ర సమాజాన్ని ఏర్పరచారు. రామానుజం అతడిని కలిసి తాను కనిపెట్టిన గణిత సిద్ధాంతాల నోటు పుస్తకాన్ని చూపించాడు. ఏదైనా ఉద్యోగం ఇవ్వమని కోరారు. అతని నోటు పుస్తకాన్ని చూసిన కలెక్టర్ ఆశ్చర్యపోయారు. ‘ఇంతటి తెలివైన వ్యక్తికి రెవెన్యూ విభాగంలో చిన్న ఉద్యోగం ఇచ్చి అవమానించలేను’ అంటూ ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చి మద్రాసులో ఉన్న గణిత శాస్త్రవేత్తల దగ్గరకు పంపించారు. 


విదేశీ గణిత శాస్త్రవేత్తలు చూసి....
రామానుజన్ గణిత సిద్ధాంతాలు లండన్ యూనివర్సిటీకి చెందిన గణిత శాస్త్రవేత్తలకు చేరాయి. వాటిని చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు. 1914లో మార్చి 17న రామానుజన్ ఇంగ్లాండు వెళ్లారు. అక్కడ తీవ్రమైన పరిశోధనలు చేసి ఎన్నో గణిత సిద్ధాంతాలను ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరణలలో పడి తన ఆరోగ్యాన్ని విస్మరించారు. లండన్ లోనే ఉండి దాదాపు 32 పరిశోధనా పత్రాలను సమర్పించారు. 


రామానుజన్ శాకాహారి కావడంతో అక్కడి ఆహారం ఇతనికి సరిపడలేదు. దీంతో తానే వండుకోవడం మొదలుపెట్టారు. కానీ పనిలో పడి చాలా సార్లు తిండి మానేసారు. దీంతో ఆరోగ్యం చాలా వరకు చెడిపోయింది. ఇక లండన్లో జీవించలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో 1919 మార్చిలో తిరిగి తమిళనాడు వచ్చేశారు. వెళ్లినప్పుడు బొద్దుగా వెళ్లిన రామానుజన్, తిరిగి వచ్చేసరికి పుల్లలా మారి వచ్చారు. అతడిని చూసి కుటుంబ సభ్యులే పోల్చుకోలేకపోయారు. 


ఎంతగా వైద్యం చేసినా ఏడాది కన్నా ఎక్కువ జీవించలేదు రామానుజన్. 1920 ఏప్రిల్ 26న మరణించారు. అప్పటికీ అతని వయసు కేవలం 33. అంత చిన్నవయసులోనే అతడు ప్రపంచానికి ఉపయోగపడే ఎన్నో గణిత సిద్దాంతాలను ఆవిష్కరించి వెళ్లిపోయారు. 


2012 నుంచి...
2012లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును ‘జాతీయ గణిత దినోత్సవం’గా ప్రకటించారు.