ఆరోగ్యానికీ, అందానికీ, ఫిట్‌నెస్‌కు డ్రై ఫ్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి ముందుంటాయి. ప్రతిరోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినమని వైద్యులు సూచిస్తారు.  అయితే ఇవి ఖరీదైనవి.  వాటిని కొనేకన్నా ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవడం వల్ల తక్కువ ధరకే వాటిని పొందవచ్చు. డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. తాజా పండ్లకు బదులు వీటిని తిన్నా ఎంతో మేలు. నిజానికి తాజా పండ్లతో పోలిస్తే ఈ ఎండు పండ్లలోనే పోషకాలు అధికం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీవక్రియను మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టుకు అందాన్ని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ రోజూ తినేవారు ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. వీటిని ఇంట్లోనే చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటి తయారీలో మైక్రోఓవెన్ కచ్చితంగా ఉండాలి. దాంతో గంటలో వీటిని తయారు చేసుకోవచ్చు.


తయారీ ఇలా
1. మొదటగా మీరు ఏ పండ్లను డ్రై ఫ్రూట్స్‌గా మార్చాలి అనుకుంటున్నారో వాటిని నీళ్లలో నానబెట్టాలి.
2.  ఐదు నుంచి ఏడు నిమిషాలు అలా నీటిలోనే ఉంచాలి. తరువాత వాటిని బయటకు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. 
3. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి నిమ్మరసం కలపాలి. ఈ పండ్ల ముక్కలను ఆ నిమ్మరసం కలిపిన నీళ్లలో వేసి ఐదు నిమిషాలు నానబెట్టాలి. 
4. తర్వాత బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేను తీసుకొని దాని అడుగున పార్సుమెంట్ పేపర్ వేయాలి.
5.  ఆ ట్రేపై కట్ చేసుకున్న పండ్ల ముక్కలను ఒక దానికి ఒకటి తాకకుండా దూరం దూరంగా పరుచుకోవాలి. 
6. మైక్రోఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి.
7. అలా చేశాక ఈ పండ్ల ముక్కలు పరిచిన ట్రేను ఓవెన్లో 25 నిమిషాల పాటు ఉంచాలి. 
8. అప్పుడు 180 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటట్టు చూసుకోవాలి. 
9. ఓవెన్లో పండ్ల ముక్కలు డీహైడ్రేట్ అవుతాయి. అంటే ఆ పండ్ల ముక్కల్లోని తేమ మొత్తం బయటికి పోతుంది. 
10. 25 నిమిషాల తర్వాత మైక్రో ఓవెన్లో నుంచి ఆ ట్రేను బయటకు తీసి పండ్ల ముక్కలను చెక్ చేయాలి.
11. ఇంకా తేమ మిగిలి ఉంది అనుకుంటే మరో 10 నిమిషాలు పాటు మైక్రోఓవెన్లో పండ్ల ముక్కలను డీహైడ్రేట్ చేయవచ్చు.
12.  ఆ తర్వాత వాటిని బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆపై గాలి చొరబడని గాజు సీసాలో వేసి వీటిని నిల్వ చేయవచ్చు.
13. ఆరు నెలల పాటు చెక్కుచెదరకుండా ఇవి తాజాగా ఉంటాయి. తినాలనుకున్నప్పుడు తీసుకొని తినవచ్చు. 


ఎలాంటి పండ్లు వాడితే మంచిది?
కివీ, అంజీర్,నల్ల ద్రాక్ష, పైనాపిల్ ముక్కలు, నారింజ తొనలు... ఇలా డ్రై ప్రూట్స్ గా మార్చుకుని తింటే మంచిది. ఇవి రుచిగా కూడా ఉంటాయి. వీటిలో విటమిణ్ ఎ, బి, సిలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తినడం వల్ల రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. ఒత్తిడి, అలసట, మానసిక ఆందోళన వంటివి తగ్గుతాయి.


Also read: నోరూరించే చికెన్ మసాలా ఫ్రై - చూస్తేనే తినేయాలనిపిస్తుంది