Good Friday Despite Jesus Death : ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతో భక్తితో గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. సాధారణంగా గుడ్ మంచి, శుభాన్ని సూచిస్తుంది. కానీ ఈ గుడ్ ఫ్రైడే యేసు క్రీస్తు శిలువపై మరణించిన సందర్భాన్ని సూచిస్తుంది. ఆయన మరణం గుడ్ ఫ్రైడే ఎందుకైంది? ఆయనని ఎందుకు శిలువ వేశారు? అసలు గుడ్ ఫ్రైడే అంటూ ఎవరికి ఎందుకు విష్ చేయకూడద? యేసు క్రీస్తు మరణాన్ని క్రైస్తవులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో చూసేద్దాం.
యేసును శిలువ వేయడానికి ప్రధాన కారణాలు
యేసు క్రీస్తూ తన బోధనలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవడం, ఆయన వాక్యంతో ఎక్కువ మందిని ఆకర్షించడం వల్ల ఆ కాలంలోని మత పెద్దలు అసూయకు గురయ్యారు. ప్రేమ, క్షమాభావం, సమానత్వం గురించి యేసు ఎక్కువగా బోధించేవారు. ఇది కొందరికి నచ్చలేదు. అలాగే యేసు తానే దేవుని కుమారుడని చెప్పడం కూడా మతనాయకులకు నచ్చలేదు. అతని ప్రభావంతో ప్రజలు తిరుగుబాటు చేస్తారనే భయంతో రోమన్ పాలకులు యేసుకు శిలువ వేయాలనుకున్నారు.
దీనిలో భాగంగా యేసు శిష్యులలో ఒకడైనా యూదా ఆయనను ద్రోహం చేసి శత్రువులకు అప్పగించాడు. అలా యేసును రోమన్ పాలకులకు చిక్కారు. వారు ఆయనను కొరడాలతో కొట్టి.. శిలువను భుజంపై వేసి ఊరేగించి.. తలపై ముళ్ల కిరీటం పెట్టి.. దాహం అని అడిగినా ఇవ్వకుండా ఆయనను చిత్రహింసలకు గురిచేసి శిలువ వేశారు.
గుడ్ ఫ్రైడే ఎందుకంటారు..
యేసును అత్యంత దయనీయంగా శిలువ వేస్తే.. క్రైస్తవులు దీనిని మాత్రం గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ఇది కొందరికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే యేసు తన ప్రాణాన్ని అర్పించి మనుషుల పాపాలకు పరిహారం చెల్లించాడని క్రైస్తవులు నమ్ముతారు. శిలువపై ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. యేసు మరణం ద్వారా సమస్త మానవాళికి రక్షణ కలిగిందని భావిస్తారు.
అందుకే యేసు క్రీస్తు శిలువ వేసిన ఘటన విషాదకరమైనదే అయినా.. ఆయన ప్రజల కోసం చేసిన త్యాగం, ప్రేమ, క్షమాభావానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. అలాగే ఇతరులు గుడ్ ఫ్రైడే అంటూ విష్ చేయకూడదని చెప్తారు. అలాగే యేసు మరణించిన మూడోరోజును పునరుత్థానంగా భావించి.. సంతోషంగా ఈస్టర్ వేడుకలు చేసుకుంటారు.
