గర్భంలో తొమ్మిది మాసాలు నిండాక తల్లి ప్రసవ వేదన మధ్య ఈ ప్రపంచాన్ని చూస్తుంది బిడ్డ. ఆ ప్రయాణం ఏ తల్లికీ జీవితకాలం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. అయితే చాలా మందికి గర్భసంచిలో సమస్యలు, ఇతర అనారోగ్య కారణాల వల్ల పిల్లలు కలగరు. అలాంటి వారికి వరంలా వచ్చింది ఐవీఎఫ్ పద్ధతి. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అంటే తండ్రి నుంచి స్పెర్మ్, తల్లి నుంచి అండం తీసుకుని ల్యాబ్‌లో కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణం అయ్యేలా చేస్తారు. పిండం ఏర్పడ్డాక దాన్ని తల్లి గర్భంలో ప్రవేశ పెడతారు. ల్యాబ్ లో ఏర్పడిన పిండం బిడ్డగా ఎదగాలంటే కచ్చితంగా తల్లి గర్భం కావాల్సిందే. కానీ సమీప భవిష్యత్తులో ఆ అవసరం కూడా ఉండదు. పూర్తి స్థాయిలో బిడ్డల్ని ల్యాబ్‌లోనే పెరిగి పెద్దయి ప్రసవించేలా చేస్తారు. ఇందుకు ప్రయోగశాలల్లోనే కృత్రిమ గర్భాశయాలు సిద్ధమవుతున్నాయి. చదువుతుంటే సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించవచ్చు కానీ, ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రయోగాలు, సదుపాయాలు శరవేగంగా జరుగుతున్నాయి. 


ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 'కృత్రిమ గర్భ కర్మాగారం' సిద్ధమవుతోంది. ఇందులో ఫలదీకరణం నుంచి తొమ్మిది నెలల వరకు ఈ బిడ్డ కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. తల్లికి నొప్పులు పడే బాధ కూడ లేదు. కృత్రిమ గర్భం తెరను తీసి బిడ్డను బయటికి తీస్తారు. తరువాత ఆ గర్భంలో మరో బిడ్డను పెంచడం మొదలుపెడతారు. ఇలా ఏడాదికి 30,000 బిడ్డలను సృష్టించేందుకు వీలుగా అతి పెద్ద ల్యాబ్ నిర్మితమవుతోంది. ,


ఎవరి ఆలోచన?
ప్రపంచంలో ఇదో పున:సృష్టి అని చెప్పవచ్చు. ఈ 'కృత్రిమ గర్భ కర్మాగారం' పేరు ఎక్టో లైఫ్. బెర్లిన్‌కు చెందిన బయోటెక్నాలజిస్టు హషేమ్ అల్ ఘైలీ దీని సృష్టికర్త.  సంతానం లేని తల్లిదండ్రుల కోసం ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారాయన. ఆయన మాటల్లో ఈ ఎక్టో లైఫ్ గర్భధారణ విషయంలో మనిషి పడుతున్న బాధలను తగ్గించడం, అలాగే సి సెక్షన్ కాకుండా ఆడవారి ఆరోగ్యాన్ని కాపాడడం అని చెప్పుకొచ్చారు. ఇంకా ఇది పరిశోధన దశలోనే ఉన్నట్టు చెప్పారు. 



ఎప్పుడు అందుబాటులోకి?
మానవ పిండాలపై పరిశోధన అనేది నైతిక మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, మానవ పిండాలపై పరిశోధన 14 రోజులకు మించి అనుమతించడం లేదు. ఆ తరువాత ఆ పిండాలను నాశనం చేయాలి. ఆ నిబంధనలు లేకపోతే ఈ సదుపాయం అతి త్వరలోనే తీసుకువస్తానని చెబుతున్నారు శాస్త్రవేత్త అల్ ఘైలీ.  అలా అయితే పది నుంచి పదిహేనేళ్లలో ప్రతి చోట ఎక్టో లైఫ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇదే జరిగితే తల్లి గర్భం అవసరం లేకుండానే పిల్లలు పుట్టేస్తారు. కానీ ఇది ప్రకృతికి విరుద్ధమని వాదిస్తున్న వారు ఉన్నారు. తల్లి గుండె చప్పుడు వింటూ బిడ్డ పెరగడం అత్యవసరమని చెబుతున్నారు. అదే వారి మధ్య బంధాన్ని పెంచుతుందని అంటున్నారు. 


Also read: ఆవలించినప్పుడు కళ్లల్లో నీళ్లెందుకు వస్తాయి?









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.