ఈ రోజుల్లో బీపి లేని వారు చాలా తక్కువ మంది ముఫ్పైల్లోనే బీపి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొంత మందికి జన్యు కారణాలు ఉంటే చాలా మందిలో లైఫ్ స్టయిల్ సరిగ్గా లేకపోయినట్లయితే, ఇంకొందరిలో రకరకాల మానసిక ఒత్తిళ్లు కారణమని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు అదుపులో లేని రక్తపోటు వల్ల గుండె సమస్యలు లేదా వాస్క్యూలార్ సమస్యలు వస్తాయని చెబుతూ వచ్చారు. కారణాలేమైనా సరే అదుపులో లేని బీపి మెదడుకు నష్టం చేస్తుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.


మెదడులోని ఏ భాగం జ్ఞాపకశక్తిని నియంత్రిస్తుందో ఇటివలే కనిపెట్టారు. మెదడులోని ఈ భాగం బలహీనపడినపుడు జ్ఞాపకశక్తి తగ్గిపొయ్యే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు మెదడులోని భాగాలను  ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ లను ఉపయోగించారు. మెదడులోని ఆలోచనా నైపుణ్యాలకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు భాగం మీద ప్రభావం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.


బీపీతో బాధపడుతున్న ఇటాలియన్ రోగుల పైన చేసిన ప్రయోగాల్లో ఈ భాగాలు కచ్చితంగా ఆలోచనా నైపుణ్యం, జ్ఞాపకశక్తికి సంబంధించినవిగా నిర్థారణ కూడా జరిగింది. ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా డిమెన్షియాకు కొత్త నివారణ మార్గాలను కనుగొనేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన టొమాజ్ గుజిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.


బీపీతో బాధ పడుతున్న వారిలోని మెదడులోని కొన్ని భాగాలను నిశితంగా పరిశీలించినపుడు జ్ఞాపకశక్తి తగ్గడానికి ఎంత వరకు ఆస్కారాలు ఉన్నాయో అంచనా వేయడం సాధ్యం అవుతుంది. ఈ సమస్య తీవ్రంగా ఉండి ప్రమాదంలో ఉన్న వారికి మందులు కనిపెట్టడానికి మార్గం సుగమం అవుతుందని కూడా ఆయన తన నివేదికలో వివరించారు.


ఇదివరకు జరిపిన పరిశోధనలో హైపర్ టెన్షన్ వల్ల వాస్క్యూలార్ డిమెన్షియాకు కారణం అవుతుందని నిరూపణ అయ్యింది. మెదడుకు జరిగే రక్తప్రసరణ తగ్గడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.


మెదడులోని నిర్ధిష్ట భాగాలలో మార్పులకు నిజంగా రక్తపోటు కారణం అవుతుందా అని జన్యుడేటాను కూడా పరిశీలించారు. మెదడులోని తొమ్మిది భాగాలు బ్లడ్ ప్రెషర్, కాగ్నిటివ్ పంక్షన్స్ కు సంబంధించినవిగా గుర్తించారు.


మెదడులోని గుండ్రని ముందు భాగం కదలికలను అదుపు చెయ్యడానికి రకరకాల అభ్యాసాలను ప్రభావితం చేస్తుంది.  ఈ పరిశోధన వల్ల రక్తపోటు వల్ల మెదడులోని ఏ భాగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయో తెలిసిందని అది భవిష్యత్తులో మెదడు చికిత్సలను సులభతరం చేస్తుందని అభిప్రాయపడ్డారు.


అయితే రక్తపోటుకు సంబంధించిన లెక్కలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ఆందోళనకరంగా ఉన్నాయనే చెప్పాలి. ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతునారు. వీరిలో చాలా మంది డిమెన్షియా బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఒత్తిడిని తగ్గించుకుని, సరైన జీవన శైలిని అనుసరించడం, భోజనంలో ఉప్పు తగ్గించడం, తగినంత వ్యాయామం, విశ్రాంతి  ద్వారా రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు వాస్క్యూలార్, గుండె సమస్యలతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలకు కూడా కారణం అవుతున్నాయని గుర్తించుకోవాలి. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా బీపి ప్రభావితం చేస్తుంది.



Also Read తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి...