చేపలు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. చేపలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం, పోటాషియం, జింగ్, అయోడిన్ వంటివి చేపల్లో ఉంటాయి. చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వల్ల విటమిన్-డి, బీ2, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి లభిస్తాయి. ఈ నేపథ్యంలో వారంలో కనీసం రెండుసార్లైన చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. అయితే, తాజా అధ్యయనం మాత్రం చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని, ముఖ్యంగా చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తోంది. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయని చెబుతోంది. 


అమెరికాకు చెందిన నిపుణులు చేపల్లో ప్రాణాంతక మెలనోమా అభివృద్ధి చెందే అవకాశాలను పరిశీలించారు. రోజూ 43 గ్రాముల చేపలను తినేవారికి చర్మ క్యాన్సర్ ముప్పు ఉందని వెల్లడించారు. అరుదుగా చేపలు తినేవారితో పోల్చితే.. రెగ్యులర్‌గా తినేవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం 22 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా సీఫుడ్‌‌లోని కాలుష్య కారకాలే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. 


వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మనం ఆరోగ్యంగా ఉండాలంటే వారంలో కనీసం రెండు 140 గ్రాముల చేపలను తినాలి. సాల్మన్ చేపలైతే మరింత మంచిది. అయితే, ప్రస్తుత ఫలితాలపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, చేపలను అతిగా కాకుండా వారంలో రెండుసార్లు తీసుకోవడం వల్ల ప్రమాదం తక్కువనని పేర్కొన్నారు.  


అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ఎన్‌యంగ్ చో ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పాలీక్లోరినేటెడ్ బైఫినిల్స్, డయాక్సిన్లు, ఆర్సెనిక్, పాదరసం వంటి కలుషితాలను చేపల్లో గుర్తించినట్లు తెలిపారు. అధికంగా చేపలను తీసుకోవడం వల్ల శరీరంలో ఆయా కలుషితాల స్థాయిలు పెరుగుతాయన్నారు. దాని వల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. 


లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ట్యూనా చేపల్లో మెలనోమా స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు తీసుకొనే సమతుల్య ఆహారంలో తప్పకుండా చేపలు ఉండాలి. ఈ అధ్యయనాల తర్వాత వైద్య నిపుణులు కూడా చేపలను తినాలనే సిఫార్సును వెనక్కి తీసుకోలేదు’’ అని స్పష్టం చేశారు.


Also Read: జస్టిన్ బీబర్‌కు ముఖ పక్షవాతం, ‘రామ్సే హంట్’ వ్యాధి మీకూ రావచ్చు, లక్షణాలివే! 
 
లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్టీఫెన్ డఫీ మాట్లాడుతూ ‘‘చేపలను రెగ్యులర్‌గా తినేవారిలో మెలనోమా ప్రమాదం కేవలం 22 శాతమే ఉంది. కాబట్టి, పెద్దగా ఆందోళన అవసరం లేదు. సూర్యరశ్మికి ఎక్కువగా గురైనవారికి చేపల వల్ల కాస్త సమస్య ఉండవచ్చు. అలాగే వేయించిన చేపల వల్ల కూడా పెద్దగా ప్రమాదం ఉండదు’’ అని తెలిపారు. కాబట్టి, మీరు చేపలను నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే, మొతాదు మించకుండా చూడండి. సాధారణంగా సీఫుడ్‌లో కాలుష్యాలు ఎక్కువే. కాబట్టి, వాటిని వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది. 


Also Read: ఫోన్ అతిగా చూస్తే ఆయుష్షు ఫట్! 34 ఏళ్లు వృథా చేస్తున్నారట: తాజా స్టడీ వెల్లడి


గమనిక: పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా ఈ కథనంలో అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.