Padmasana aka Lotus Benefits : రోజూ ఉదయాన్నే లేచి పద్మాసనం వేస్తే.. అది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది అంటున్నారు యోగా నిపుణులు. యోగా నిరంతరం సాధన చేస్తే పర్లేదు కానీ.. అస్సలు యోగా జోలికి వెళ్లనివారు కనీసం.. పద్మాసనం అయినా వేయాలని సూచిస్తున్నారు. పైగా ఇది చాలా తేలికైన ఆసనం. ఈ పద్మాసనాన్నే లోటస్ పోజ్ అని కూడా అంటారు. ఇది ఎన్నో శారీరక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ ఆసనం ఎలా చేయాలి? దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఎన్నో శతాబ్ధాలుగా చేస్తున్న ఆసనాల్లో పద్మాసనం ఒకటి. యోగాభ్యాసంలో అత్యంత ముఖ్యమైన ఆసనాల్లో ఇది కూడా ఒకటి. దీనిని రెగ్యూలర్​గా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మెరుగైన జీర్ణక్రియను అందించడంలో సహాయం చేస్తుంది ఒత్తిడిని తగ్గించి.. నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. మైండ్​ని కంట్రోల్​లో ఉంచి.. సానుకూలమైన ఆలోచనలను ప్రోత్సాహిస్తుంది. 


పద్మాసనం ఎలా చేయాలంటే.. 


ముందుగా నేలపై కూర్చోండి. కాళ్లను ముందుకు చాచండి. ఇప్పుడు మీ కుడి మోకాలిని మీ ఎడమ తొడపై ఉంచండి. మీ ఎడమ కాలుని.. కుడి తొడపై ఉంచండి. మోకాళ్లపై చేతులు ఉంచి నిటారుగా కూర్చోండి. ఇప్పుడు కళ్లు మూసుకుని.. శ్వాసపై దృష్టిని ఉంచండి. ఈ ఆసనంలో 5 నుంచి 10 నిమిషాలు ఉండొచ్చు. దీనివల్ల శారరీకంగా, మానసికంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. 


శారీరక ప్రయోజనాలు..


మోకాళ్లలో దృఢత్వాన్ని పెంచి.. నొప్పులను దూరం చేస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. వెన్ను సమస్యలున్నవారు దీనిని రెగ్యూలర్​గా చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు. జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పద్మాసనంతో దూరమవుతాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి.. పొత్తికడుపులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో నొప్పిని దూరం చేసి.. ఉపశమనం అందిస్తుంది. మూత్రాశయం, మూత్రపిండాలను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


మానసిక ప్రయోజనాలకోసం.. 


ఆందోళన, ఒత్తిడిని పద్మాసనం తగ్గిస్తుంది. మనసును శాంతపరిచి.. ఆందోళన, ఒత్తిడిని దూరం చేస్తుంది. చిరాకుగా ఉన్నప్పుడు.. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ ఆసనం వేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అలసటను తగ్గిస్తుంది. శక్తి, సామర్థ్యాలను పెంచి.. యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది. 


పద్మాసనంలోని రకాలు


పద్మాసనంలో వివిధ రకాలు కూడా ఉన్నాయి. ఈ పద్మాసనాన్ని లోటస్ పోజ్ అంటారు. అయితే దీనిలో అర్ధ పద్మాసనం ఉంటుంది. ఈ ఆసనం వేసేప్పుపుడు కాలుని చాపి.. మరో కాలును ఇతర కాలుపై ఉంచుతారు. బద్ద పద్మాసనం రెండోది. ఈ ఆసనంలో పద్మాసనంలో కూర్చోని.. చేతులను వెనుకకు పెడతారు. లేదంటే వెనుకవైపు చేతులతో నమస్కారం పోజ్ పెడతారు. సుప్త పద్మాసనంలో కాళ్లను పద్మాసనంలో ఉంచి.. శరీరాన్ని నేలపై ఆన్చి ఉంచుతారు. ఈ సుప్త పద్మాసనం మరింత ఎఫెక్టివ్​గా ఉంటుంది. 



వారు చేయకపోవడమే మంచిది..


యోగా చేస్తున్నప్పుడు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పద్మాసనం చేసే సమయంలో కూడా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మోకాలు, పాదం దగ్గర సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం చేయకపోవడమే మంచిది. లేదంటే నొప్పి ఎక్కువ అవుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా దీనిని చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది కడుపు, కటి ప్రాంతాలపై ఒత్తిడిని పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కూడా చేయకపోవడమే మంచిది. 


Also Read : మధుమేహాన్ని, కీళ్లనొప్పులను దూరం చేసే హెర్బల్ టీ.. దీనిని ఎలా తయారు చేయాలంటే