TSPSC postpones Horticulture Officer Exam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను కమిషన్ వాయిదా వేసింది. వాయిదాపడిన పరీక్షను జూన్ 17న నిర్వహించనున్నట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు. పేపర్ లీక్ అయి ఉండొచ్చునన్న అనుమానంతో టీఎస్‌పీఎస్సీ హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఏ అవకతవకలు లేకుండా చూడటంలో భాగంగా కొత్త ప్రశ్నపత్రంతో జూన్ 17న పరీక్ష నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్  పోస్టుల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 4న రాతపరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే పేపర్ లీకు నేపథ్యంలో పరీక్షను వాయిదావేశారు.  



కొన్ని పరీక్షలు వాయిదా.. మరికొన్ని రద్దు చేసిన టీఎస్ పీఎస్సీ
పేపర్లు లీక్ కావడంతో ఇదివరకే నిర్వహించిన నాలుగు పరీక్షల నోటిఫికేషన్లను టీఎస్ పీఎస్సీ రద్దు చేసింది. జరగాల్సిన రెండు పరీక్షలను సైతం కమిషన్ వాయిదా వేసింది. పేపర్ లీక్ అయినట్లు గుర్తించడంతో ఇటీవల అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి (డీఏఓ) పరీక్షలను రద్దు చేసింది. అనంతరం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకు అయిందని తేలడంతో మెయిన్స్ పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో పాటు ప్రిలిమ్స్ ఫలితాలను రద్దు చేసింది టీఎస్ పీఎస్సీ. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలను వాయిదా వేయగా.. తాజాగా ఏప్రిల్ లో జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ నెలకు వాయిదా వేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను జూన్ 11న నిర్వహించనున్నారు.


Also Read:


త్వరలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల షెడ్యూలు! ఇప్పటికే ప్రకటించిన పరీక్ష తేదీల్లోనూ మార్పులు?
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ నియామక పరీక్షల కొత్త షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని కమిషన్ వెల్లడించింది. అయితే... గ్రూప్-1తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. ఏప్రిల్‌ 23 నుంచి 29వ  తేదీ వరకు నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను జూన్‌ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఉండటంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు స్పష్టం చేశారు.  మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది.  ఇటీవల యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వేయాలని నిర్ణయించింది. యూపీఎస్సీ సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రూప్‌ 1 పరీక్ష రాస్తున్న 25 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ఈ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అధికారులు మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేశారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...