TSPSC Group 1 Recruitment: తెలంగాణలో గ్రూప్–1 పోస్టులను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 70కి పైగా పోస్టులను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 600 వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు మరో 130 పోస్టులు ఖాళీ అవుతాయని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఆయా శాఖలు ఖాళీల వివరాలను ఆర్థికశాఖకు సమర్పించినట్లు సమాచారం. అయితే ఆదివారం (ఫిబ్రవరి 4న) జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి,  గ్రూపు-1 నోటిఫికేషన్‌పై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా? త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.


గతంలో గుర్తించిన 503 గ్రూప్ –1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైన ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు, ఏడాది చివరిలో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని సూచించింది. పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలనే అంశంపై  కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా? పాత నోటిఫికేషన్ కు కొనసాగింపుగా సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలా? అనే అంశంపై మంత్రివర్గం సమావేశం తరువాత క్లారిటీ రానుంది. 


అయితే గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్  లీకవడంతో పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. తుది తీర్పు పెండింగ్ లో ఉంది. అయితే ఆ కేసును విచారించి, తీర్పు వచ్చేసరికి సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.  కేసును వెనక్కి తీసుకుని కొత్తగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.


తెలంగాణ ఏర్పడిన తర్వాత  తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు.


ముందుకెళ్లాలా? వేచి చూడాలా? 
గ్రూప్-1 పరీక్షపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై కొత్తగా ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ బోర్డు, ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దుచేసి ముందుకెళ్లాలా? లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా? కొత్తగా గుర్తించే ఖాళీలతో తాజాగా మరో గ్రూప్-1 నోటిఫికేషన్ వేయడమా? లేదా పాత నోటిఫికేషన్‌కు అనుబంధంగా చేర్చడమా? అనే విషయమై నిర్ణయం వెలువడాల్సి ఉంది.


రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల ఆధారంగా..
2011లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఆ నియామకాలు 2018లో పూర్తయ్యాయి. తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్‌పీఎస్సీ రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్-1 నుంచి కిందిస్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న విషయమై ఇప్పటికే నియామక సంస్థల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది.