తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తికావడంతో.. వారంరోజుల్లో ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైనవారి తుది జాబితాను తెలంగాణ పోలీసు నియామకబోర్డు విడుదల చేయనుంది. అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన, నేరచరిత్రపై స్థానిక పోలీసు స్టేషన్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత అభ్యర్థులకు నియామపత్రాలు అందజేయనున్నారు. అభ్యర్థులకు ఆగస్టు నుంచే పోలీసు శిక్షణ ప్రారంభంకానుంది.  కానిస్టేబుల్ తుది జాబితాను కూడా రెండు వారాల్లో వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


తుది రాతపరీక్షలో ఎంపికైన వారిలో నుంచి 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. ఎస్సైల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా, మహిళలు, పురుషులు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్ పాయింట్లు... ఇలా దాదాపు 180కిపైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకషంగా పరిశీలిస్తున్నారు.


ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలో జాబితా వెలువడే అవకాశముంది. అయితే... మొదట ఎస్సైలుగా ఎంపికైన 579, ఏఎస్సైలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తుది రాతపరీక్షలో ఎంపికైన 97,175 మందిలో పలువురు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు. తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్‌లాగ్‌లను నివారించవచ్చనేది నియామక మండలి ఆలోచన. ఎస్సైగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టును వదులుకుంటామని అండర్ టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాతే నియామక పత్రాలు.. 
తుది ఎంపిక జాబితాలో పేరున్నా... అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం ఉండదు. ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన నేపథ్యం, నేరచరిత్ర, ప్రవర్తన... తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాలవారీగా స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) చేపట్టనుంది. క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిశీలనపైనా ఎస్‌బీ దృష్టి సారించనుంది. విజేతల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి ఠాణాల్లో ఏమైనా కేసులున్నాయా...? అని పరిశీలించిన తర్వాత మండలికి నివేదిక పంపనున్నారు. ఆ నివేదికలో క్లీన్ చిట్ లభిస్తేనే ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటారు.


ALSO READ:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial