తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామకాల ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. మొత్తం 16,604 కానిస్టేబుల్ పోస్టులకుగాను 15,750 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటించింది. అయితే కోర్టులో కేసుల దృష్ట్యా పలు పోస్టులకు ఫలితాలు విడుదల చేయలేదని బోర్డు తెలిపింది. పీటీవోలోని 100 డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలోని 225 పోస్టులకు ఫలితాలు కోర్టు కేసుల కారణంగా విడుదల చేయలేదని స్పష్టంచేసింది. 


ఇదిలా ఉండగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు దక్కడం విశేషం. దీంతో, ఆ కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. వారంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడం వల్లే విజయం సాధించినట్లు వారు తెలిపారు. 



వీరేకాకుండా.. వరంగల్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్‌ వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడుకాగా.. తల్లి అంజలి గృహిణి. 


కానిస్టేబుల్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు అక్టోబరు 4న విడుదలైన సంగతి తెలిసిందే. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు; 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా.. తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి పోలీస్ నియామక బోర్డు అవకాశం కల్పించింది. అక్టోబరు 5న ఉదయం 8 గంటల నుంచి అక్టోబరు 7న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసిన వారికి కొద్ది రోజుల్లో ఆన్‌లైన్‌లోనే అధికారులు సమాధానం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ఎలాంటి వ్యక్తిగత వినతులను నేరుగా ఇవ్వడాన్ని అంగీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'అటెస్టేషన్' పత్రాల సమర్పణ తప్పనిసరి...
తుది ఎంపిక జాబితాలో ఎంపికైన అభ్యర్థుల కోసం వ్యక్తిగత లాగిన్‌లలో అటెస్టేషన్ పత్రాలను అక్టోబరు 7 నుంచి 10 వరకు అందుబాటులో ఉంచనున్నారు. వాటిని డిజిటల్‌గానే పూరించి అనంతరం డౌన్‌లోడ్ చేసుకొని పాస్‌పోర్టు సైజ్ ఫొటోను అతికించి మూడు సెట్లపై గెజిటెడ్ సంతకాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా పత్రాలను అక్టోబరు 12, 13 తేదీల్లో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు తాము ఎంపికైన జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్-సీపీఎల్, రవాణా కానిస్టేబుల్(ప్రధాన కార్యాలయం) అభ్యర్థులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో, టీఎస్ఎస్పీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, ఎక్సైజ్, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్(ఎల్సీ) అభ్యర్థులు సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయంలో సమర్పించాలని ఒక ప్రకటనలో పేర్కొంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..