టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్- 1 ప్రిలిమ్స్ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ జూన్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులును కొట్టివేయాలని కోరుతూ టీఎస్‌పీఎస్సీ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.


దీనిపై జూన్ 10న న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరీక్షకు అనుమతించి.. ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. నిందితులు షమీమ్, సురేష్, రమేష్, సాయి సుష్మితలకు హాల్‌టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.


టీఎస్‌పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న ఈ నలుగురికి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు అనుమతించాలంటూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 11న జరుగుతున్న గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు ఇతర శాఖాపరమైన పరీక్షల్లో పాల్గొనకుండా డిబార్ చేయడాన్ని సవాలు చేస్తూ రమేష్ కుమార్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పి.మాధవీదేవి కమిషన్‌కు నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. పిటిషనర్లకు హాల్‌టిక్కెట్‌లు అందజేసి పరీక్షలకు అనుమతించాలని, అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ టీఎస్‌పీస్సీ జూన్ 10న హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.


పరీక్షలు నిలిపివేయడం పరిష్కారం కాదు.. హైకోర్టు వ్యాఖ్యలు
ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను నిలిపివేయడం సమస్యకు పరిష్కారం కాదని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లీకేజీ వ్యవహారం బయటపడడంతో పరీక్షలను రద్దుచేసి తిరిగి నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ చేస్తున్న ప్రయత్నాలను గౌరవించాలని పేర్కొంది. పరీక్షల నిర్వహణకు రాజ్యాంగ సంస్థ అయిన టీఎస్‌పీఎస్సీ కాకుండా మరో సంస్థపై ఆధారపడలేమని తేల్చిచెప్పింది. 3.80 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయలేమని అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్.మురళీధర్ రెడ్డి అప్పీలు దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 


పిటిషనర్ల తరఫు న్యాయవాది సుధీర్ వాదనలు వినిపిస్తూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను హడావుడిగా నిర్వహించాలన్న టీఎస్‌పీఎస్సీ నిర్ణయం సరికాదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని ప్రతి ఒక్కరినీ అనుమానించడం సరికాదని పేర్కొంది. లీకేజీపై దర్యాప్తు కొనసాగుతోందని, దాన్ని న్యాయవ్యవస్థ చూసుకుంటుందని, అది పూర్తయ్యే దాకా పరీక్షలు నిర్వహించరాదనడం సరికాదంది. పిటిషనర్ కోరినట్లు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే అది పూర్తవడానికి 20 ఏళ్లు పడుతుందని, అప్పటివరకు పరీక్షలు నిర్వహించకూడదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్, టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావులు వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంటూ, అప్పీలును కొట్టివేసింది.


సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి...
టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఇంజినీరు, డిప్యూటీ ఏవో ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి సిట్ నిర్వహిస్తున్న దర్యాప్తుపై సమగ్ర వివరాలతో మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటరును పరిశీలిస్తే సిట్ దర్యాప్తుపై ఒక అంచనాకు వచ్చి సీబీఐకి అప్పగించాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయించవచ్చంది. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై జూన్ 9న జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.


Related Articles:


రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!


TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..