TGPSC Group1 Prelims: తెలంగాణలో జూన్‌ 9న నిర్వహించనున్న 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, మరో రెండు రోజుల్లో పరీక్ష జరుగనున్న నేపథ్యంలో.. పరీక్ష వాయిదా విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయలేమని హైకోర్టు జూన్‌ 7న తేల్చిచెప్పింది. కేవలం కొందరి కోసం ఎక్కువ మంది ప్రయోజనాలు దెబ్బతినేలా ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. పరీక్ష వాయిదాకు సింగిల్‌ జడ్జి నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీలును ఈ సందర్భంగా హైకోర్టు కొట్టివేసింది. 


రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షను వాయిదావేయాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్‌ జూన్ 1న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉండటంతో.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదావేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై జూన్ 4న జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో కేవలం రెండు ఇంటెలిజెన్స్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, అదే గ్రూప్-1 పోస్టులకు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వాదించారు. కేవలం కొంత మంది ప్రయోజనాల కోసం.. లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. కమిషన్ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. కేసు విచారణను ముగించింది.


దీంతో సింగిల్‌ జడ్జి నిర్ణయంపై.. ఎం.గణేశ్, భరత్‌లు అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం జూన్ 7న విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు పరీక్షలను ఒకే రోజు జరుగుతున్నాయని, అభ్యర్థులో ఏదో ఒక పరీక్షకు హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. పరీక్షను వాయిదా వేస్తే నిరుద్యోగులకు ఊరట లభిస్తుందన్నారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 4.30 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ దశలో వాయిదా వేస్తే లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ అప్పీలును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను కమిషన్ ఇప్పటికే అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు). ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులలో నిర్ణీత నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు.


పరీక్ష కేంద్రాలు..
ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.


గ్రూప్-1 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Related Articles:


➥ 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల - పరీక్ష వివరాలు, అభ్యర్థులకు మార్గదర్శకాలివే


➥ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - ఫొటోగ్రాఫ్, పేరు వివరాల్లో తప్పులుంటే ఇలా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే 


➥ 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, ఫొటో లేకపోతే 'నో ఎంట్రీ' - ఈ రూల్స్ పాటించాల్సిందే



 మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..